GST: కుండలు అమ్మే వ్యక్తికి ₹1.25 కోట్ల GST నోటీస్

Potter In UP Gets ₹1 Crore Central GST Notice

Potter In UP Gets ₹1 Crore Central GST Notice

GST: ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ జిల్లాకు చెందిన సయీద్ అనే పేద వ్యక్తి చిన్న కుండలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. ఒక్కో కుండను కేవలం రూ.2కి అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్న అతనికి అకస్మాత్తుగా భారీ షాక్ ఎదురైంది. అతని పేరుపై ఏకంగా రూ.1.25 కోట్ల జీఎస్టీ నోటీసు రావడంతో అతను, అతని కుటుంబ సభ్యులు ఆశ్చర్యానికి గురయ్యారు. తాను చిన్నపాటి వ్యాపారి మాత్రమేనని, ఇంత పెద్ద స్థాయి వ్యాపారాలు తనకు ఎలాంటి సంబంధం లేదని సయీద్ చెబుతున్నాడు.

నోటీసులో తన పేరుతో నాలుగు కంపెనీలు నడుస్తున్నట్లు చూపించడంతో అసలు విషయం బయటపడింది. గతంలో లోన్ కోసం ప్రయత్నించిన సమయంలో సయీద్ తన ఆధార్, పాన్ కార్డు ప్రతులను ఇచ్చినట్లు సమాచారం. ఆ డాక్యుమెంట్లను ఎవరో దుర్వినియోగం చేసి, అతని పేరుతో నకిలీ సంస్థలు ప్రారంభించి తప్పుడు వ్యాపారాలు నిర్వహించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ కారణంగా భారీ లావాదేవీలు జరిగినట్లు నమోదు కావడంతో జీఎస్టీ శాఖ నుంచి ఈ నోటీసు జారీ అయ్యింది.

తాను చదువు తెలియని సాధారణ వ్యక్తినని, కుండలు అమ్ముకోవడమే తన జీవనాధారం అని సయీద్ వాపోతున్నాడు. రోజువారీ సంపాదనతోనే కుటుంబాన్ని పోషించాల్సిన పరిస్థితి ఉండగా, కోట్ల రూపాయల నోటీసు రావడం వల్ల తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. తనకు జరిగిన అన్యాయంపై స్పందించాలని, అసలు నిందితులను గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం అందజేశాడు.

ఇలాంటి ఘటనలు సాధారణ ప్రజలు తమ ఆధార్, పాన్ వంటి వ్యక్తిగత పత్రాలను ఎవరికి పడితే వారికి ఇవ్వడం ఎంత ప్రమాదకరమో స్పష్టం చేస్తున్నాయి. అధికారులు దర్యాప్తు చేసి సయీద్‌కు న్యాయం చేయాలని స్థానికులు కూడా కోరుతున్నారు.

Also Read: Heart Attack: మీకు ఈ అలవాట్లు ఉంటే హార్ట్ ఎటాక్ కాయం

GST: కుండలు అమ్మే వ్యక్తికి ₹1.25 కోట్ల GST నోటీస్