LPG Cylinder Sales: దేశంలో వంట గ్యాస్ (LPG) కొరతపై వస్తున్న వార్తల నేపథ్యంలో ప్రజల్లో ఆందోళన పెరిగిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ కారణంగా చాలా మంది వినియోగదారులు అవసరానికి మించి గ్యాస్ సిలిండర్లను బుక్ చేస్తున్నారని అధికారులు పేర్కొన్నారు. అయితే దేశంలో ఎలాంటి వంట గ్యాస్ కొరత లేదని కేంద్రం స్పష్టం చేసింది. ప్రస్తుతం ఎల్పీజీ ఉత్పత్తిని సుమారు 30 శాతం వరకు పెంచినట్లు వెల్లడించింది.
పెట్రోలియం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ వివరాల ప్రకారం, యుద్ధానికి ముందు రోజుకు సగటున 55.7 లక్షల ఎల్పీజీ సిలిండర్ల బుకింగ్స్ జరిగేవి. అయితే ప్రస్తుతం ఈ సంఖ్య 75.7 లక్షలకు పెరిగింది. అంటే రోజుకు సుమారు 25 లక్షల అదనపు బుకింగ్స్ జరుగుతున్నాయని తెలిపారు. ఇది ప్రజల్లో ఉన్న ఆందోళనకు నిదర్శనమని ఆమె పేర్కొన్నారు.
ప్రజలు పుకార్లను నమ్మి భయపడవద్దని కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. అవసరానికి మించి సిలిండర్లను బుక్ చేయడం వల్ల ఇతరులకు ఇబ్బందులు కలగవచ్చని హెచ్చరించింది. అందువల్ల “పానిక్ బుకింగ్స్” చేయకుండా వినియోగదారులు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించింది.
వినియోగదారుల సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు ప్రభుత్వ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తమ కాల్ సెంటర్లను కూడా బలోపేతం చేశాయి. కాల్ సెంటర్ల సంఖ్యను 400కు పెంచడంతో పాటు టెలిఫోన్ లైన్లను 50 వరకు పెంచినట్లు కేంద్రం తెలిపింది. దీని వల్ల వినియోగదారులు తమ ఫిర్యాదులను సులభంగా నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది.
ఇదిలా ఉండగా గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్లో విక్రయించడం లేదా అక్రమంగా నిల్వ చేయడం వంటి చర్యలపై కఠినంగా వ్యవహరించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా అధికారులు ముఖ్యంగా కలెక్టర్లు మరియు ఎస్పీలు ఈ విషయాన్ని ప్రత్యేకంగా పర్యవేక్షించాలని సూచించింది.
అదే సమయంలో పరిస్థితిని పర్యవేక్షించేందుకు కొన్ని రాష్ట్రాలు ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశాయి. దేశవ్యాప్తంగా ఇంధన సరఫరా వ్యవస్థ సజావుగా కొనసాగేందుకు రాష్ట్రాలతో నిరంతర సమన్వయం కొనసాగుతుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
LPG Cylinder Sales: గ్యాస్ దొరకదేమోనని.. రోజుకు ఎన్ని బుకింగ్స్ అవుతున్నాయంటే..