Dangerous Places: మన దేశంలో అనేక వింతలు, విశేషాలు ఉన్న ప్రదేశాలు ఉన్నాయి. అయితే కొన్ని ప్రాంతాలు అత్యంత ప్రమాదకరమైన గ్రామాలుగా కూడా పేరుగాంచాయి. అక్కడ నివసించే ప్రజలు నిత్యం ప్రాణ భయంతో జీవించాల్సిన పరిస్థితి ఉంటుంది. కొన్ని గ్రామాల్లో క్రూరమృగాల భయం, మరికొన్ని చోట్ల ప్రకృతి వైపరీత్యాలు, ఇంకొన్ని చోట్ల విచిత్రమైన విశ్వాసాలు ప్రజలను భయపెడుతుంటాయి. ఇప్పుడు భారతదేశంలో ప్రమాదకరంగా చెప్పబడే ఐదు గ్రామాల గురించి తెలుసుకుందాం.
గోసాబా గ్రామం – పశ్చిమ బెంగాల్
పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్స్ ప్రాంతంలో ఉన్న గోసాబా గ్రామం చాలా ప్రమాదకరమైన ప్రాంతంగా గుర్తింపు పొందింది. ఈ ప్రాంతం రాయల్ బెంగాల్ పులులకు ప్రసిద్ధి. వరల్డ్ వైల్డ్లైఫ్ ఫండ్ (WWF) నివేదికల ప్రకారం ఇక్కడ సుమారు 258 పులులు సంచరిస్తున్నాయి. దట్టమైన మడ అడవులు పులులకు సహజ నివాసంగా ఉండటంతో అవి తరచూ గ్రామాల్లోకి వస్తుంటాయి. చేపలు పట్టడానికి వెళ్లే స్థానికులు పులుల దాడులకు గురయ్యే ఘటనలు తరచూ జరుగుతుంటాయి. ప్రతి సంవత్సరం 50 నుంచి 100 మంది వరకు పులుల దాడుల్లో ప్రాణాలు కోల్పోతున్నట్లు చెబుతారు.

షెట్పాల్ గ్రామం – బీహార్
బీహార్లోని సోన్పూర్ జిల్లాలో ఉన్న షెట్పాల్ గ్రామం కూడా ప్రమాదకరమైన గ్రామాల్లో ఒకటిగా చెప్పబడుతుంది. ఈ గ్రామ పరిసరాల్లో విషపూరితమైన నాగుపాములు ఎక్కువగా కనిపిస్తాయి. అయితే ఆశ్చర్యకరంగా, అక్కడి ప్రజలు పాములను పవిత్రంగా భావించి వాటిని చంపరు. గ్రామంలోని ప్రతి వీధిలో కూడా పాములు కనిపించడం సాధారణం. పిల్లలు, రైతులు అప్పుడప్పుడు ప్రమాదంలో పడుతుంటారు. అయితే గ్రామస్తుల ఇళ్లలో యాంటీ వెనం మందులు అందుబాటులో ఉండటంతో మరణాలు చాలా అరుదుగా జరుగుతాయని చెబుతారు.

మొహాలి గ్రామం – మధ్యప్రదేశ్
మధ్యప్రదేశ్లోని సాగర్ జిల్లాలో ఉన్న మొహాలి గ్రామం కూడా ప్రమాదకర గ్రామాల్లో ఒకటిగా ఉంది. ఈ గ్రామం నైరదేహి వన్యప్రాణి అభయారణ్యం దగ్గర ఉండటంతో రాత్రి వేళల్లో పులులు, చిరుతలు గ్రామంలోకి రావడం జరుగుతుంది. పొలాల్లో పని చేసే రైతులు, పాఠశాలకు వెళ్లే పిల్లలు కూడా కొన్ని సందర్భాల్లో ఈ జంతువుల దాడులకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. ఈ సమస్యను తగ్గించేందుకు అటవీ శాఖ వాచ్ టవర్లు, సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసినప్పటికీ దాడులను పూర్తిగా ఆపడం సాధ్యపడలేదు. అందుకే గ్రామస్తులు రాత్రిపూట గస్తీ కాస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

గురెజ్ లోయ – జమ్మూ కాశ్మీర్
జమ్మూ కాశ్మీర్లోని గురెజ్ లోయ పరిసర గ్రామాలు కూడా ప్రమాదకర ప్రాంతాలుగా గుర్తించబడ్డాయి. ఈ ప్రాంతంలో తరచూ కొండచరియలు విరిగిపడటం, భారీ వర్షాలు, భూకంపాలు జరుగుతుంటాయి. అలాగే శీతాకాలంలో భారీ హిమపాతం కారణంగా ఈ గ్రామాలకు ఇతర ప్రాంతాలతో రవాణా సంబంధాలు కూడా తెగిపోతాయి. ప్రమాదాలు జరిగినప్పుడు సైన్యం స్థానికులకు సహాయం చేస్తూ ఉంటుంది.

కుల్ధారా గ్రామం – రాజస్థాన్
రాజస్థాన్లోని జైసల్మేర్ సమీపంలో ఉన్న కుల్ధారా గ్రామం చాలా కాలంగా వింత కథలతో ప్రసిద్ధి చెందింది. కథనం ప్రకారం, 1825లో జాజియా పన్ను వేధింపుల కారణంగా అక్కడ నివసించిన బ్రాహ్మణులు ఒక్క రాత్రిలోనే గ్రామాన్ని వదిలి వెళ్లిపోయారని చెబుతారు. వెళ్లే సమయంలో గ్రామం ఎప్పటికీ నివాసానికి పనికిరాకూడదని శాపం పెట్టారని స్థానికుల నమ్మకం. అప్పటి నుంచి ఈ గ్రామం వెలవెలబోయింది. రాత్రి వేళల్లో అక్కడ విచిత్రమైన శబ్దాలు వినిపిస్తాయని స్థానికులు చెబుతుంటారు. అందుకే పర్యాటకులు కూడా ఈ గ్రామాన్ని పగటి సమయంలో మాత్రమే సందర్శిస్తుంటారు.

ఇలా భారతదేశంలో కొన్ని గ్రామాలు క్రూరమృగాలు, ప్రకృతి వైపరీత్యాలు, విచిత్ర విశ్వాసాలు కారణంగా ప్రమాదకర ప్రాంతాలుగా గుర్తింపు పొందాయి. అయితే ఈ ప్రాంతాల్లో నివసించే ప్రజలు మాత్రం ఈ పరిస్థితులకు అలవాటు పడుతూ తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారు.
Also Read: Instagram: ఇన్ స్టాగ్రామ్ లో రోజుకు ఎన్ని వీడియోలు పోస్ట్ అవుతాయంటే..
Dangerous Places: ఇక్కడ అడుగుపెడితే.. ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందే..!
