Accident: రాజస్థాన్ రాష్ట్రం జైసల్మేర్ జిల్లాలో మంగళవారం ఉదయం భయానక ప్రమాదం చోటుచేసుకుంది. తైయాట్ ప్రాంతంలోని మిలటరీ స్టేషన్ సమీపంలో వెళ్తున్న ఒక ప్రైవేట్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు విస్తరించడంతో ప్రయాణికులు బయటకు రాకముందే బస్సు మంటల్లో చిక్కుకుంది.
ఈ ప్రమాదంలో కనీసం 15 మంది సజీవదహనమయ్యారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారని అధికారులు తెలిపారు. మరో 25 మందికి పైగా తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గాయపడిన కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ బస్సు జైసల్మేర్ నుంచి జోధ్పూర్ వైపు బయలుదేరింది. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో మొత్తం 57 మంది ప్రయాణికులు ఉన్నారని పోలీసులు తెలిపారు. మంటలు ఏ కారణంగా చెలరేగాయో ఇప్పటివరకు స్పష్టంగా తెలియలేదు, అయితే ఇంజిన్ ఓవర్హీట్ కావడం లేదా షార్ట్ సర్క్యూట్ కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనతో ప్రాంతం అంతా విషాదంలో మునిగిపోయింది. ప్రభుత్వ అధికారులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించి, మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించే అవకాశం ఉంది.
