Curd: వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచేందుకు చాలా మంది తమ ఆహారంలో పెరుగును తప్పనిసరిగా చేర్చుకుంటారు. పెరుగులో ఉండే కాల్షియం, మంచి బ్యాక్టీరియా జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా ఎండ వేడిని తగ్గించడంలో కూడా సహాయపడతాయి. అయితే, ముఖ్యంగా రాత్రి వేళల్లో పెరుగు తీసుకోవడంపై కొన్ని జాగ్రత్తలు అవసరమని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
పెరుగు తినడానికి ఉత్తమ సమయం పగటి వేళ, ముఖ్యంగా మధ్యాహ్న భోజనం సమయంలో. ఈ సమయంలో జీర్ణక్రియ బాగా జరుగుతుండడంతో పెరుగు సులభంగా అరిగి శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. రాత్రి సమయంలో జీర్ణక్రియ నెమ్మదిగా ఉండటం వల్ల చల్లని పదార్థాలు తీసుకోవడం అంత మంచిది కాదని చెబుతున్నారు.
అయితే, రాత్రి పూట పెరుగు పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. తీసుకోవాలనుకుంటే అందులో కొద్దిగా మిరియాల పొడి లేదా జీలకర్ర పొడి కలిపి తినడం మంచిది. దీంతో పెరుగులోని చలువ గుణం వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలు కొంతవరకు తగ్గుతాయి.
కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్న మహిళలు మాత్రం రాత్రి పూట పెరుగు తినకుండా ఉండటం మంచిది. తరచూ కఫం, దగ్గు సమస్యలతో బాధపడేవారికి రాత్రి పెరుగు తింటే ఉదయం ముక్కు దిబ్బడ, అసౌకర్యం కలగొచ్చు. అలాగే శ్వాసకోశ సమస్యలు ఉన్నవారికి ఇది సమస్యను మరింత పెంచే అవకాశం ఉంది.
జీర్ణశక్తి బలహీనంగా ఉన్న మహిళలు కూడా రాత్రి వేళ పెరుగు తీసుకోవడం నివారించాలి. జీర్ణక్రియ మందగించే సమయంలో పెరుగు అరిగించడం కష్టమవుతుంది. కీళ్ల నొప్పులు లేదా గౌట్ సమస్య ఉన్నవారికి రాత్రి పెరుగు తినడం వల్ల నొప్పులు, వాపులు పెరిగే ప్రమాదం ఉంది. సైనస్ సమస్య ఉన్నవారికి తలనొప్పి, శ్వాసలో ఇబ్బందులు కలగవచ్చు.
మొత్తానికి, పెరుగు ఆరోగ్యానికి మేలు చేసే ఆహారమే అయినప్పటికీ, సరైన సమయానికి తీసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా రాత్రి వేళల్లో తీసుకునే ముందు వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకోవాలి.
