Pregnancy: మృత శిశువును ప్రసవించిన తర్వాత మళ్లీ గర్భం దాల్చేందుకు ఎక్కువ కాలం వేచి ఉండాల్సిన అవసరం లేదని ఒక అంతర్జాతీయ అధ్యయనం వెల్లడించింది. సాధారణంగా వైద్యులు కనీసం ఒక సంవత్సరం గ్యాప్ తీసుకోవాలని సూచిస్తారు. అయితే తాజా పరిశోధనల ప్రకారం, సంవత్సరం లోపే గర్భం దాల్చినా పెద్ద ప్రమాదం ఉండదని తేలింది.
ఈ అధ్యయనం పశ్చిమ ఆస్ట్రేలియా, ఫిన్లండ్, నార్వే దేశాలకు చెందిన 14,452 మంది మహిళలపై నిర్వహించారు. వీరంతా గతంలో మృత శిశువుకు జన్మనిచ్చినవారే. వీరిలో చాలామంది మహిళలు (సుమారు 63%) మృత శిశువు జననం తర్వాత 12 నెలలలోపే మళ్లీ గర్భం దాల్చారు.
పరిశీలనలో భాగంగా, ఈ మహిళల్లో కేవలం 2% మాత్రమే మళ్లీ మృత శిశువులకు జన్మనిచ్చారు. అలాగే 18% మంది శిశువులు ముందుగానే పుట్టగా, 9% శిశువులు తక్కువ బరువుతో జన్మించారు. ముఖ్యంగా, 2-3 సంవత్సరాల తర్వాత గర్భం దాల్చిన మహిళలతో పోలిస్తే, 12 నెలలలోపే గర్భం దాల్చిన వారిలో ప్రమాదాలు ఎక్కువగా లేవని పరిశోధకులు గుర్తించారు.
ఈ ఫలితాలు మహిళలకు మానసికంగా ధైర్యం ఇచ్చేవిగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇంగ్లండ్కు చెందిన ప్రొఫెసర్ అలెక్స్ హీజెల్ మాట్లాడుతూ, “మృత శిశువు మరణానికి కారణాలు తెలుసుకోవడం ముఖ్యమే కానీ, మళ్లీ ఎప్పుడు గర్భం దాల్చాలి అనే విషయం కంటే, తల్లి మానసికంగా సిద్ధంగా ఉండటం ఎంతో కీలకం” అని అన్నారు.
ఇంగ్లండ్లో ప్రతి 225 ప్రసవాల్లో ఒకటి మృత శిశువు జననంగా నమోదవుతోంది. అయితే 2000 సంవత్సరం తర్వాత ఈ సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. అయినప్పటికీ, ఇతర యూరప్ దేశాలతో పోలిస్తే ఇంకా కొంత వెనుకబడి ఉంది.
అధ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్ అన్నెట్టే రీగన్ ప్రకారం, ఈ ఫలితాలు మృత శిశువు జననం తర్వాత మహిళలకు సరైన కౌన్సెలింగ్ ఇవ్వడంలో ఉపయోగపడతాయి. అయితే, ఒక ప్రసవం నుంచి పూర్తిగా కోలుకోకముందే మళ్లీ గర్భం దాల్చితే పోషకాహార లోపం వల్ల కొన్ని సమస్యలు రావచ్చని ఆమె సూచించారు. కానీ ఇవి మళ్లీ మృత శిశువు జననం లేదా అబార్షన్కు తప్పనిసరిగా దారితీయవని వివరించారు.
అమెరికాకు చెందిన డాక్టర్ మార్క్ క్లెబనాఫ్ కూడా ఈ అంశంపై మాట్లాడుతూ, “మహిళ వయసు, కుటుంబ పరిస్థితులు, పిల్లలపై ఆసక్తి వంటి అంశాలతో పాటు, ముఖ్యంగా ఆమె మానసికంగా సిద్ధంగా ఉన్నారా అనే విషయాన్ని వైద్యులు పరిగణనలోకి తీసుకోవాలి” అని సూచించారు.
