Junior NTR: ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ తన వ్యక్తిగత హక్కులు భంగం పొందుతున్నాయంటూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన తరఫున సీనియర్ న్యాయవాది సాయి దీపక్ పిటిషన్ దాఖలు చేసి, ఈ-కామర్స్ సైట్లు మరియు సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్ల్లో ఎన్టీఆర్ పేరు, ఫొటోలు, ఇతర కంటెంట్ను అనుమతి లేకుండా ఉపయోగిస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
ఈ పిటిషన్పై విచారణ చేసిన జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ సింగ్ అరోరా, ఐటీ నిబంధనలు–2021 ప్రకారం ఈ-కామర్స్, సోషల్ మీడియా సంస్థలు దీనిని అధికారిక ఫిర్యాదుగా పరిగణించి మూడు రోజుల్లో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తదుపరి విచారణను డిసెంబర్ 22కి వాయిదా వేశారు.
ఇక ముందు నాగార్జున, అజయ్ దేవ్గణ్, ఐశ్వర్యరాయ్ వంటి పలువురు నటులు కూడా తమ పేరు, ఫొటోలు, వీడియోలను అనుమతి లేకుండా ఉపయోగించకుండా కోర్టుల ద్వారా రక్షణ పొందారు. అదే తరహాలో జూనియర్ ఎన్టీఆర్ కూడా వాణిజ్య ఉపయోగాల్లో తన హక్కులను ఉల్లంఘించరాదంటూ ఈ పిటిషన్ వేశారు.
సోషల్ మీడియా విస్తరించడంతో సెలబ్రిటీలపై ట్రోలింగ్, కంటెంట్ దుర్వినియోగం, ఏఐ ద్వారా తప్పుడు పోస్టులు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రముఖులు న్యాయపరమైన రక్షణ కోసం కోర్టులను ఆశ్రయించడం పెరుగుతోంది.
