Gold Rates: బంగారం, వెండి ధరలు ప్రస్తుతం భారీగా పడిపోతున్నాయి. చరిత్రలో అరుదుగా కనిపించేలా ఈ లోహాలు తక్కువ సమయంలోనే గణనీయంగా క్షీణించాయి. అంతర్జాతీయంగా ఒకే వారం వ్యవధిలో బంగారం సుమారు 10 శాతం, వెండి దాదాపు 15 శాతం తగ్గాయి. 2011 తర్వాత బంగారానికి ఒక వారంలో ఇంత పెద్ద నష్టం రావడం ఇదే మొదటిసారి.
ఇరాన్ యుద్ధం ప్రారంభానికి ముందు, అంటే 2026 ఫిబ్రవరి 27కి ముందు రోజు, భారతదేశంలో 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ.1.59 లక్షలు ఉండేది. అయితే యుద్ధం ప్రారంభమైన 22వ రోజు, మార్చి 21 నాటికి అది దాదాపు 8 శాతం తగ్గి రూ.1.47 లక్షలకు చేరింది. మార్చి 23న తులం బంగారం ధరలో ఒక్కసారిగా రూ.5,950 వరకు పడిపోయి ప్రస్తుతం రూ.1,40,020 వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధర దాదాపు 14 శాతం తగ్గి ఔన్సుకు $4,488కి చేరింది. సాధారణంగా యుద్ధ సమయంలో బంగారం ధరలు పెరుగుతాయి. కానీ ఈసారి మాత్రం భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది.
సాధారణంగా బంగారం సురక్షిత పెట్టుబడిగా భావిస్తారు. యుద్ధాలు లేదా అనిశ్చితి సమయంలో పెట్టుబడిదారులు బంగారం వైపు మొగ్గు చూపుతారు. 1990 గల్ఫ్ యుద్ధం, 2003 ఇరాక్ యుద్ధం సమయంలో బంగారం మంచి లాభాలను ఇచ్చింది. 2022లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం సమయంలో కూడా మొదట ధరలు పెరిగి, తరువాత తగ్గాయి.
ఈసారి ధరలు పడిపోవడానికి పలు కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా అమెరికన్ డాలర్ బలపడటం ఒక ప్రధాన కారణం. డాలర్ బలంగా ఉండటం వల్ల బంగారం ఖరీదు పెరిగి, దానికి డిమాండ్ తగ్గుతుంది. అదేవిధంగా వడ్డీ ఇచ్చే పెట్టుబడులు ఆకర్షణీయంగా మారడంతో పెట్టుబడిదారులు వాటి వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో బంగారంపై పెట్టుబడులు తగ్గాయి.
ఇంకా 2025లో బంగారం ధరలు సుమారు 74 శాతం పెరిగిన నేపథ్యంలో, ఇప్పుడు పెట్టుబడిదారులు లాభాలను బుక్ చేసుకోవడం ప్రారంభించారు. దీనివల్ల కూడా ధరలపై ఒత్తిడి పెరిగింది. భారతదేశంలో అధిక ధరల కారణంగా వినియోగదారులు కొనుగోళ్లు తగ్గించారు. ముంబైలో ఆభరణాల అమ్మకాలు సుమారు 75 శాతం తగ్గినట్లు సమాచారం. జువెలరీ వ్యాపారులు కూడా తమ వద్ద ఉన్న నిల్వలు ఎక్కువగా ఉండటంతో కొత్తగా కొనుగోళ్లు తగ్గిస్తున్నారు.
ఇక వెండి ధర కూడా ఇదే తరహాలో హెచ్చుతగ్గులకు లోనైంది. 2025 ప్రారంభంలో కిలో వెండి ధర రూ.86,000 ఉండగా, 2026లో అది రూ.3.39 లక్షల వరకు పెరిగింది. అయితే గత నెల 27న రూ.2,85,000 వద్ద ఉన్న ధర, ప్రస్తుతం మార్చి 23 నాటికి దాదాపు రూ.2,30,000కు పడిపోయింది. అంటే ఈ కాలంలో సుమారు రూ.55,000 వరకు తగ్గింది.
భవిష్యత్తులో ధరలు ఎలా ఉండబోతాయన్న దానిపై నిపుణుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొందరు 2026 చివరికి బంగారం ఔన్సుకు $6,000 వరకు పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు. రూపాయి బలహీనంగా ఉంటే, భారతదేశంలో 10 గ్రాముల బంగారం ధర రూ.2 లక్షలకు చేరే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఇది యుద్ధ పరిస్థితులు, చమురు ధరలు, డాలర్ బలం వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది.
దీర్ఘకాలంలో మాత్రం బంగారం, వెండి రెండింటికీ మంచి అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. మార్కెట్ ప్రస్తుతం అస్థిరంగా ఉన్నప్పటికీ, పెట్టుబడిదారులు ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడం కంటే, క్రమంగా పెట్టుబడి పెట్టడం మంచిదని సూచిస్తున్నారు.
