Post Office Scheme: సుకన్య సమృద్ధి యోజన (Sukanya Samriddhi Yojana) అనేది భారత ప్రభుత్వం ప్రారంభించిన ప్రత్యేక పొదుపు పథకం. ముఖ్యంగా ఆడపిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ స్కీమ్ రూపొందించబడింది. అమ్మాయిల ఉన్నత విద్య మరియు వివాహ అవసరాల కోసం తల్లిదండ్రులు ముందుగానే డబ్బు సేవ్ చేసుకునేలా ఈ పథకం ప్రోత్సహిస్తుంది. “బేటీ బచావో, బేటీ పడావో” కార్యక్రమంలో భాగంగా 2015లో ప్రధాని నరేంద్ర మోదీ ఈ పథకాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం ఈ పథకంపై సుమారు 8.2 శాతం వడ్డీ అందుతోంది.
హనుమకొండ పోస్టల్ సూపరింటెండెంట్ వి. హనుమంతు తెలిపిన వివరాల ప్రకారం, సుకన్య సమృద్ధి ఖాతా ఆడపిల్లల భవిష్యత్తుకు ఎంతో ఉపయోగకరమైనది. ఒక అమ్మాయి పేరుతో ఒకే ఖాతా తెరవవచ్చు. ఒక కుటుంబంలో గరిష్టంగా ఇద్దరు ఆడపిల్లల వరకు ఈ ఖాతాలు ప్రారంభించుకోవచ్చు. ఈ పథకానికి 10 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న బాలికలు మాత్రమే అర్హులు. తల్లిదండ్రులు లేదా చట్టబద్ధమైన సంరక్షకులు ఈ ఖాతాను ప్రారంభించవచ్చు.
ఈ ఖాతాను ఏదైనా ఇండియన్ పోస్ట్ ఆఫీస్లో లేదా అధికృత వాణిజ్య బ్యాంకుల్లో తెరవచ్చు. కేవలం రూ.250తో ఖాతాను ప్రారంభించే అవకాశం ఉంది. అయితే సంవత్సరానికి కనీసం రూ.1,000 నుండి గరిష్టంగా రూ.1,50,000 వరకు డిపాజిట్ చేయవచ్చు. ఈ పెట్టుబడిపై ఆదాయ పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది.
ఉదాహరణకు, నెలకు రూ.1,000 చొప్పున సంవత్సరానికి రూ.12,000 జమ చేస్తే 15 సంవత్సరాల్లో మొత్తం రూ.1,80,000 అవుతుంది. దీనిపై సుమారు రూ.3,74,613 వరకు వడ్డీ లభిస్తుంది. అంటే మొత్తం కలిపి దాదాపు రూ.5,54,613 వరకు మొత్తాన్ని పొందే అవకాశం ఉంటుంది. మీరు ఎంత ఎక్కువ మొత్తాన్ని జమ చేస్తే, అంత ఎక్కువ వడ్డీ కూడా పొందవచ్చు.
ఈ ఖాతాను బాలిక వివాహం జరిగే వరకు లేదా ఖాతా ప్రారంభించిన తేదీ నుంచి 21 సంవత్సరాల వరకు కొనసాగించవచ్చు. ఖాతా తెరవడానికి బాలిక జనన ధ్రువీకరణ పత్రం, తల్లిదండ్రుల చిరునామా రుజువు, గుర్తింపు పత్రం మరియు ఆధార్ కార్డు వంటి పత్రాలు అవసరం. ఈ పత్రాలతో సమీపంలోని పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంకుకు వెళ్లి సులభంగా ఖాతాను ప్రారంభించవచ్చు.
మొత్తం మీద సుకన్య సమృద్ధి యోజన పథకం ఆడపిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులకు ఒక మంచి పొదుపు అవకాశంగా నిలుస్తుందని అధికారులు సూచిస్తున్నారు.
