RBI: కొత్త రూల్.. రూ.10,000+ పంపిస్తే గంట ఆగాల్సిందే!

RBI plans 1-hour delay on high-value UPI payments to curb rising digital fraud

RBI plans 1-hour delay on high-value UPI payments to curb rising digital fraud

RBI: ఆన్‌లైన్ మోసాలను తగ్గించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కొత్త ప్రతిపాదనను తీసుకువచ్చింది. ఖాతాదారుల భద్రతను పెంచే లక్ష్యంతో తీసుకున్న ఈ నిర్ణయం ప్రకారం, ఇకపై రూ.10,000 కంటే ఎక్కువ మొత్తాన్ని ఆన్‌లైన్ ద్వారా పంపితే ఆ డబ్బు లబ్ధిదారుడి ఖాతాలో వెంటనే జమ కాకుండా సుమారు ఒక గంట ఆలస్యంగా చేరుతుంది.

ఈ వ్యవధిలో పంపిన వ్యక్తికి లావాదేవీని రద్దు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. దీనివల్ల తొందరపాటు లేదా మోసపూరిత పరిస్థితుల్లో పంపిన డబ్బును తిరిగి నిలిపివేయడం సులభమవుతుంది. అయితే ఈ నిబంధన మర్చంట్ చెల్లింపులు, చెక్ పేమెంట్స్‌కు వర్తించదు. బ్యాంకులు అనుమానాస్పద లావాదేవీలపై అలర్ట్‌లు కూడా ఇస్తాయి. ఈ ప్రతిపాదనపై మే 8 వరకు ఆర్‌బీఐ ప్రజల అభిప్రాయాలను స్వీకరించనుంది.

యూపీఐ లావాదేవీలకు కూడా ఈ నిబంధన వర్తిస్తుంది. ముఖ్యంగా రోజువారీగా రూ.10,000 కంటే ఎక్కువ మొత్తాన్ని యూపీఐ ద్వారా పంపినప్పుడు ఈ ఆలస్యం అమల్లోకి వస్తుంది. అంటే డబ్బు వెంటనే ట్రాన్స్‌ఫర్ కాకుండా కొంతసేపు నిలిపివేయబడుతుంది.

ఈ నిర్ణయం వెనుక ప్రధాన కారణం ఆన్‌లైన్ మోసాలు పెరుగుతుండటమే. 2021 నుంచి సుమారు రూ.550 కోట్ల మోసాలు నమోదవగా, 2025 నాటికి ఇది రూ.22 వేల కోట్లకు పెరిగింది. వీటిలో 98 శాతానికి పైగా మోసాలు రూ.10,000 కంటే ఎక్కువ లావాదేవీల్లోనే జరిగాయి. అందుకే ఈ కొత్త నియమాన్ని ప్రతిపాదించారు.

హ్యాకర్లు లేదా మోసగాళ్లు సాధారణంగా ప్రజలను భయపెట్టి లేదా ఒత్తిడి చేసి వెంటనే డబ్బు పంపించేలా చేస్తారు. అలాంటి సమయంలో ఒక గంట గ్యాప్ ఉంటే, బాధితులు ఆలోచించి నిర్ణయం మార్చుకునే అవకాశం ఉంటుంది. దీంతో మోసాలను కొంతవరకు అరికట్టవచ్చు.

అయితే ఈ కొత్త విధానం యూపీఐ వ్యవస్థకు ఒక సవాలుగా మారే అవకాశముంది. ఎందుకంటే వెంటనే డబ్బు అవసరమయ్యే వారికి ఆలస్యం ఇబ్బందిగా మారవచ్చు. మొత్తంగా చూస్తే, డబ్బు భద్రత పెరుగుతుందిగానీ, ట్రాన్స్‌ఫర్‌లో కొంత ఆలస్యం తప్పదని చెప్పవచ్చు.

Also Read: Royal Enfield: ఫైనల్లీ.. రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి తొలి ఈ-బైక్!

RBI: కొత్త రూల్.. రూ.10,000+ పంపిస్తే గంట ఆగాల్సిందే!