ITR: గత ఆర్థిక సంవత్సరం (2024-25)కు సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్నులు (ఐటీఆర్) ఎలాంటి జరిమానాలు లేకుండా దాఖలు చేసేందుకు గడువు సెప్టెంబరు 15, సోమవారంతో ముగియనుంది. ఈ గడువును మళ్లీ పొడిగించారన్న వార్తలు వస్తున్నప్పటికీ, వాటిని ఆదాయపు పన్ను విభాగం ఖండించింది.
ఐటీ విభాగం తన అధికారిక ‘ఎక్స్’ ఖాతా ద్వారా స్పష్టంచేస్తూ – “ఐటీఆర్ దాఖలు గడువు ఇప్పటికే జులై 31 నుంచి సెప్టెంబరు 15 వరకు పొడిగించాం. ఇప్పుడు దీన్ని సెప్టెంబరు 30 వరకు పెంచారన్నది తప్పుడు సమాచారం. ఎలాంటి పొడిగింపు లేదు. కాబట్టి పన్ను చెల్లింపుదారులు ఫేక్ న్యూస్ను నమ్మొద్దు. గడువు సెప్టెంబరు 15కే పరిమితం” అని తెలిపింది.
అలాగే, పన్ను చెల్లింపుదారుల సౌలభ్యం కోసం 24×7 హెల్ప్డెస్క్ ఏర్పాటు చేసినట్లు తెలిపింది. కాల్స్, లైవ్ చాట్స్, వెబ్ సెషన్స్తో పాటు ఎక్స్లోనూ సహాయం అందిస్తామని చెప్పింది.
ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 6 కోట్లకు పైగా పన్ను చెల్లింపుదారులు తమ ఐటీఆర్ ఫైలింగ్ పూర్తి చేశారని, వీటిలో 5.51 కోట్ల రిటర్నులు ఇ-వెరిఫై అయ్యాయని ఐటీ విభాగం వెల్లడించింది. ఇప్పటికే 3.78 కోట్ల రిటర్నుల పరిశీలన కూడా పూర్తయిందని పేర్కొంది.
రూ.3 లక్షలకు మించి ఆదాయం ఉన్నవారు వెంటనే రిటర్నులు దాఖలు చేయాలని సూచించింది. కొత్త పన్ను విధానం, పాత పన్ను విధానం మధ్య ఏది లాభదాయకమో పరిశీలించుకోవాలని పన్ను చెల్లింపుదారులకు సూచించింది.
అలాగే మోసపూరిత మినహాయింపులు చూపించడం, తప్పుడు రీతిలో రిఫండులు కోరడం పూర్తిగా తప్పు అని హెచ్చరించింది. అలా చేస్తే భవిష్యత్తులో నోటీసులు, జరిమానాలు తప్పవని స్పష్టం చేసింది.
