Communist Leader: కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సిపిఐ) సీనియర్ నాయకుడు, మాజీ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి కన్నుమూశారు. ఆయన వయసు 82 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం రాత్రి ఆయన తుది శ్వాస విడిచారు.
తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మం. కంచుపాడులో మార్చి 25, 1942లో జన్మించిన సుధాకర్ రెడ్డి, చిన్న వయసులోనే కమ్యూనిస్టు భావజాలానికి ఆకర్షితులయ్యారు. అనంతరం విద్యార్థి ఉద్యమం నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టి, ప్రజాసమస్యలపై నిరంతరం పోరాటం చేశారు.
సిపిఐలో ఆయనకు ఉన్న క్రమశిక్షణ, నిబద్ధత కారణంగా రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలోనూ కీలక పదవులు చేపట్టారు. 2012లో సీపీఐ జాతీయ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించి పార్టీ బలపరచడంలో, సిద్ధాంతపరంగా దృఢతతో ముందుకు నడిపించడంలో ప్రత్యేక పాత్ర పోషించారు.
లోక్సభలో కూడా ఆయన ప్రజలకు ప్రాతినిధ్యం వహించారు. నల్గొండ నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎంపీగా ఎన్నికై, రైతు సమస్యలు, కార్మికుల హక్కులు, సామాజిక న్యాయం వంటి అంశాలను బలంగా ప్రస్తావించారు.
సుధాకర్ రెడ్డి మరణం పట్ల రాజకీయ వర్గాలు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నాయి. ఆయన త్యాగాలు, ప్రజాప్రయోజనాల కోసం చేసిన కృషి ఎప్పటికీ చిరస్మరణీయమని నేతలు పేర్కొంటున్నారు.
