VIDEO: ఇరాన్లో వ్యాపించిన నిరసనలు రోజురోజుకూ ఉద్రిక్తంగా మారుతున్నాయి. టెహ్రాన్తో పాటు అనేక ప్రధాన నగరాల్లో ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్స్ న్యూస్ ఏజెన్సీ (HRANA) వెల్లడించిన వివరాల ప్రకారం, ఇప్పటివరకు కనీసం 538 మంది ప్రాణాలు కోల్పోగా, పలుచోట్ల భారీ స్థాయిలో ఆస్తినష్టం జరిగింది. అదేవిధంగా, సుమారు 10,670 మంది నిరసనకారులను భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయని కూడా నివేదిక పేర్కొంది.
ప్రభుత్వం నిరసనలపై కఠిన చర్యలు తీసుకోవడంతో పరిస్థితి మరింత దిగజారినట్లు ఆ సంస్థ పేర్కొంది. అదికాకుండా, ఇరాన్ ప్రభుత్వం ఇంటర్నెట్ మరియు ఫోన్ సేవలను నిలిపివేయడంతో, నేలస్థాయి పరిస్థితులను అంచనా వేయడం చాలా కష్టమైంది. సమాచార బ్లాక్ అవుట్ కారణంగా దేశం లోపల, వెలుపల ఉన్న ప్రజల మధ్య సంబంధాలు దాదాపుగా నిలిచిపోయాయి. అసలు ఎంత నష్టం జరిగిందన్న వివరాలపై కూడా స్పష్టత లేకుండా పోయింది.
ఇరాన్లో ప్రారంభమైన ఈ సంక్షోభం ఇప్పుడు దేశ సరిహద్దులు దాటి ప్రభావం చూపుతోంది. అమెరికాలోని లాస్ ఏంజిలిస్లో ఇరాన్ అధ్యక్షుడు ఖొమైనీ విధానాలకు వ్యతిరేకంగా వేలాది మంది భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ప్రదర్శన సందర్భంగా అకస్మాత్తుగా ఓ యూ-హాల్ ట్రక్ నిరసనకారులపై దూసుకెళ్లింది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి గంభీరంగా ఉన్నట్లు స్థానిక మీడియా తెలిపింది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.
లాస్ ఏంజిలిస్లోని వెస్ట్వుడ్ విల్ షైర్ ఫెడరల్ భవనం ముందు వేలాది మంది గుమికూడిన సమయంలోనే ఈ ఘటన జరిగింది. ట్రక్ అకస్మాత్తుగా జనసంద్రం వైపు దూసుకురావడంతో అక్కడ ఒక్కసారిగా పరుగు పందెం మొదలైంది. భయాందోళనలు చెలరేగాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సంఘటన కారణంగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
