Visa: అమెరికాలో నిబంధనలు ఉల్లంఘించిన అంతర్జాతీయ విద్యార్థులపై అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా సుమారు 6,000 మంది విదేశీ విద్యార్థుల వీసాలను రద్దు చేసినట్లు అమెరికా విదేశాంగశాఖ వెల్లడించిందని బీబీసీ రిపోర్ట్ తెలిపింది.
వీసా రద్దుకు ప్రధాన కారణాలుగా చట్ట ఉల్లంఘనలు, దాడులు, మత్తులో వాహనదోపిడీలు, దోపిడీలు చేయడం వంటి సంఘటనలు ఉన్నట్లు సమాచారం. వీరిలో దాదాపు 4,000 మంది నేరాలకు పాల్పడగా, ఐఎన్ఏ 3బీ చట్టం కింద ఉగ్రవాదానికి సంబంధం ఉన్న 300 మంది కూడా ఈ జాబితాలో ఉన్నారు. కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమైన వేళ ఈ విషయాలు బయటకు రావడం గమనార్హం.
ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత, దేశంలోని ఉన్నత విద్యావ్యవస్థలో పలు మార్పులు చేశారు. ముఖ్యంగా ప్రధాన విశ్వవిద్యాలయాలను లక్ష్యంగా చేసుకుని కఠిన విధానాలను అమలు చేశారు. వీటి ప్రభావం అంతర్జాతీయ విద్యార్థులపై ప్రతికూలంగా పడుతోంది.
మొదటగా జనవరిలో యాంటీ-సెమిటిజం (యూదులపై వ్యతిరేకత)ను అరికట్టే బిల్లు పాస్ చేశారు. ఆ బిల్లులోని నిబంధనల ప్రకారం, అంతర్జాతీయ విద్యార్థులు పాలస్తీనాకు మద్దతుగా ఆందోళనల్లో పాల్గొంటే వారిని దేశ బహిష్కరణ చేసే అవకాశం ఉంది.
జూన్లో విదేశీ విద్యార్థులకు సంబంధించిన కొత్త ఇంటర్వ్యూ షెడ్యూల్ను రద్దు చేశారు. అలాగే సోషల్ మీడియా వెట్టింగ్ను కఠినతరం చేశారు. అమెరికాలో చదవాలనుకునే విద్యార్థులు తమ సోషల్ మీడియా ఖాతాలను తప్పనిసరిగా సమర్పించాలి. అధికారులు వారి పోస్టులు, కామెంట్లు, లైకులు పరిశీలించి జాతీయ భద్రతకు ముప్పు లేదని నిర్ధారించిన తరువాత మాత్రమే వీసా మంజూరు చేస్తారు.
ఇక కీలక విశ్వవిద్యాలయాల్లో పరిశోధన నిధులను కూడా తగ్గించారు. పాలస్తీనా అనుకూల ఆందోళనల్లో పాల్గొన్న విదేశీ విద్యార్థులను అరెస్టు చేయించారు. హార్వర్డ్ వంటి విశ్వవిద్యాలయాల్లో అంతర్జాతీయ విద్యార్థుల నియామకాలను అడ్డుకున్నారు. ఈ కారణంగా ట్రంప్ ప్రభుత్వంతో విశ్వవిద్యాలయాల మధ్య న్యాయపోరాటం కూడా మొదలైంది.
గతేడాది గణాంకాల ప్రకారం, అమెరికాలో సుమారు 10 లక్షల అంతర్జాతీయ విద్యార్థులు చదువుతున్నారు. వీరి ద్వారా అమెరికా ఆర్థిక వ్యవస్థకు దాదాపు 43.8 బిలియన్ డాలర్లు లభించాయి. మొత్తం విద్యార్థుల్లో వీరి శాతం సుమారు 6% ఉంటుందని ఎన్ఎఫ్ఎస్ఏ అసోసియేషన్ వివరించింది.
