Andhra: కడప జిల్లాలోని ప్రొద్దుటూరు పట్టణం ఈశ్వరరెడ్డి నగర్లో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు అక్కాచెల్లెల్లు చిన్న వయసులోనే పెద్ద కష్టాలను ఎదుర్కొన్నారు. మొదట తండ్రి అనారోగ్యంతో మరణించగా, ఆ వేదనను తట్టుకోలేక తల్లి ఆత్మహత్య చేసుకుంది. దీంతో అక్క కవిత, చెల్లి మహేశ్వరి (26) తమ తాత రామయ్య వద్ద పెరిగారు.
ఇటీవల అక్క కవితకు వివాహం జరిగింది. అయితే చెల్లి మహేశ్వరి తాతయ్యతోనే ఉండి ఆయనను చూసుకుంటూ, చాపాడు మండలంలోని ఒక కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేస్తూ వచ్చారు. కానీ కుటుంబం లేకపోవడంతో, తనకు ఆదరణ తగ్గిపోతుందన్న భావనతో మహేశ్వరి మనసులో బాధ పెరిగినట్టు పోలీసులు పేర్కొన్నారు.
దీపావళి సందర్భంగా వారం రోజుల క్రితం కవిత తన భర్తతో కలిసి తాతయ్య ఇంటికి వచ్చింది. శుక్రవారం సాయంత్రం కవిత దంపతులు గుడికి వెళ్లగా, మహేశ్వరి ఇంటిలో ఒంటరిగా ఉన్నారు. వారు తిరిగి రాగానే, ఆమె కనిపించకపోవడంతో పై అంతస్తులోని రేకుల ఇంటిని చూసారు. అక్కడ మహేశ్వరి తాడుతో ఉరేసుకుని వేలాడుతూ కనిపించారు.
వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినా, వైద్యులు అప్పటికే ఆమె మరణించినట్లు తెలిపారు. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోవడం, అక్క వివాహం తర్వాత ఒంటరితనం మరింత పెరగడంతో మానసికంగా కుంగిపోయిన మహేశ్వరి ఆత్మహత్యకు పాల్పడ్డారని, అక్క కవిత ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పట్టణం వన్టౌన్ పోలీస్స్టేషన్ ఎస్.ఐ సంజీవరెడ్డి తెలిపారు.
