Telangana: నిజామాబాద్ జిల్లాలో భర్తను హతమార్చిన భార్య ఘటన కలకలం రేపింది. మాక్లూరు మండలం బోర్గాం గ్రామంలో ఈ దారుణ సంఘటన జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. రమేష్ గాఢ నిద్రలోకి జారుకున్న తర్వాత అతని భార్య సౌమ్య టవల్తో ఉరేసి హత్య చేసింది. అనంతరం గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు, చుట్టుపక్కలవారిని నమ్మించే ప్రయత్నం చేసింది.
సౌమ్య ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తూ ఉండగా దిలీప్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా వివాహేతర సంబంధంగా మారినట్లు పోలీసులు తెలిపారు. ఆ సంబంధానికి భర్త రమేష్ అడ్డుగా ఉన్నాడని భావించిన సౌమ్య, అతన్ని తొలగించాలనే ఉద్దేశంతో ఈ హత్యకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. భర్తను హత్య చేయడానికి సౌమ్య గత నాలుగు నెలలుగా ప్లాన్ వేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
అయితే రమేష్ మృతిపై అతని సోదరుడికి అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు అసలు నిజాన్ని వెలికితీసి, సౌమ్య చేసిన నేరాన్ని గుర్తించారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర సంచలనం నెలకొంది.
