Telangana: ఒక్క విద్యార్థీ లేని బడుల్లో టాప్ 2లో తెలంగాణ

Telangana among top 2 schools with no students

Telangana among top 2 schools with no students

Telangana: తెలంగాణలో విద్యా రంగానికి సంబంధించిన తాజా గణాంకాలు ఆందోళన కలిగించే స్థాయిలో ఉన్నాయి. దేశవ్యాప్తంగా విద్యార్థులు ఒక్కరైనా లేని పాఠశాలల (జీరో స్కూల్స్) విషయంలో మన రాష్ట్రం రెండో స్థానంలో నిలిచింది. కేంద్ర విద్యాశాఖ గురువారం విడుదల చేసిన 2024-25 విద్యా సంవత్సరం యూడైస్ (UDISE) నివేదిక ప్రకారం, పశ్చిమబెంగాల్ 3,812 జీరో స్కూల్స్‌తో మొదటి స్థానంలో ఉండగా, తెలంగాణలో 2,245 పాఠశాలలు విద్యార్థుల్లేక మూతబడినట్టే కొనసాగుతున్నాయి.

రాష్ట్రంలోని ఈ 2,245 జీరో పాఠశాలల్లో 1,016 మంది ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ, వారు సమీప పాఠశాలలకు డిప్యుటేషన్‌పై వెళ్తూ విధులు నిర్వహిస్తున్నారు. ఈ సంఖ్య సంవత్సరానికోసారి పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. 2022-23లో 1,672, 2023-24లో 2,097 జీరో స్కూల్స్ ఉండగా, ఇప్పుడు మరో 148 పెరగడం గమనార్హం. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా మాత్రం ఈ సంఖ్య గణనీయంగా తగ్గినట్లు నివేదిక చెబుతోంది.

ఏకోపాధ్యాయ పాఠశాలలు తగ్గుముఖం

ఇక మరోవైపు, ఒకే ఉపాధ్యాయుడితో నడిచే ఏకోపాధ్యాయ పాఠశాలల సంఖ్య క్రమంగా తగ్గడం మాత్రం ఊరటనిచ్చే అంశంగా మారింది. 2022-23లో రాష్ట్రంలో 6,054 ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉండగా, 2023-24లో 5,895కు తగ్గాయి. తాజాగా 2024-25లో ఇవి మరింత తగ్గి 5,001కి చేరాయి. ఈ పాఠశాలల్లో 62,288 మంది విద్యార్థులు చదువుతున్నారు. అంటే ప్రతి పాఠశాలలో సగటు విద్యార్థుల సంఖ్య కేవలం 12మందే.

10 మందికి లోపు విద్యార్థులున్న పాఠశాలలు పెరుగుదల

రాష్ట్రంలో 10 మందికి లోపు విద్యార్థులున్న పాఠశాలలు పెరుగుతున్నాయి. గత ఏడాది ఇది 11.60 శాతం ఉండగా, ఈసారి 12.70 శాతానికి చేరింది. జాతీయ సగటు అయితే కేవలం 5.10 శాతం మాత్రమే. అంటే తెలంగాణలో పరిస్థితి దేశ సగటుతో పోలిస్తే రెండింతలు అధ్వానంగా ఉందని చెప్పవచ్చు. ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్, లద్ధాఖ్ రాష్ట్రాల్లోనే మనకంటే పరిస్థితి మరింత దిగజారిపోయినట్టుగా నివేదిక వెల్లడించింది.

Also Read: Crime: దారుణం.. మందుకు డబ్బులివ్వలేదని మిక్సీ వైరును మెడకు చుట్టి హత్య

Telangana: ఒక్క విద్యార్థీ లేని బడుల్లో టాప్ 2లో తెలంగాణ