Alert: హైదరాబాద్: కల్తీ దగ్గు మందులపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. రీలైఫ్, రెస్పీ ఫ్రెష్-టీఆర్ అనే రెండు దగ్గు మందులను నిషేధిస్తూ తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మందుల లో కల్తీ పదార్థాలు కలవడాన్ని గుర్తించిన అధికారులు, వీటి వినియోగం ప్రజారోగ్యానికి ప్రమాదకరమని హెచ్చరించారు.
ఈ ఔషధాలు గుజరాత్కు చెందిన రెండు ఫార్మాస్యూటికల్ కంపెనీల ద్వారా తయారయ్యాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో ‘కోల్డ్ ఫ్’ అనే దగ్గు మందు వాడిన పలువురు చిన్నారులు మృత్యువాత పడ్డారు అనే ఆరోపణల మధ్య, ఈ చర్యలు తీసుకోవడం జరుగుతోంది. ఈ ఘటనలపై దర్యాప్తు కొనసాగుతోంది.
ఈ నేపథ్యంలో తెలంగాణ ఔషధ నియంత్రణ విభాగం (డీసీఏ) అప్రమత్తమై చర్యలకు పాల్పడింది. ఇప్పటికే ‘కోల్డ్ రిఫ్’ అనే మరో దగ్గు మందును పూర్తిగా నిషేధించినట్టు డీసీఏ ప్రకటించింది. కల్తీ మందుల వలన ప్రజల ఆరోగ్యానికి ముప్పు ఏర్పడే అవకాశాన్ని దృష్టిలో పెట్టుకుని, రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా చర్యలు తీసుకోవడం గమనార్హం. ప్రజలు అలాంటి మందుల వినియోగానికి దూరంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
