KTR: గత రెండు సంవత్సరాలుగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే తనపై వ్యక్తిత్వ హననానికి పాల్పడుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. డ్రగ్స్ కేసులు, హీరోయిన్లతో లింకులు వంటి నిరాధార ఆరోపణలు చేసి తాను, తన కుటుంబం మానసికంగా వేధింపులకు గురయ్యారని ఆయన విమర్శించారు. సిట్ విచారణకు హాజరయ్యే ముందు తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ ఇవి వెల్లడించారు.
కేటీఆర్ మాట్లాడుతూ, “తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఎన్నో కేసులు పెట్టినా వెనక్కి తగ్గలేదు. ఇప్పుడూ విచారణ పేరుతో భయపెట్టే కాంగ్రెస్ ప్రయత్నాలు ఫలించవు” అని స్పష్టం చేశారు. గత 20 ఏళ్లుగా రాష్ట్రం కోసం పని చేస్తున్నానని, అప్పటి సమైక్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు, నాయకులు చేసిన కుట్రలను ఎదుర్కొని తెలంగాణ సాధించుకున్నామని గుర్తుచేశారు. “కాంగ్రెస్ మా మీద కుట్రలు చేయడం కొత్త కాదు” అని కూడా వ్యాఖ్యానించారు.
తమపై వచ్చిన బాధ్యతలు ఏవైనా శ్రద్ధగా నిర్వర్తించామని, 10 ఏళ్ల కాలంలో తెలంగాణ అన్ని రంగాల్లో అద్భుత అభివృద్ధి సాధించిందని కేటీఆర్ అన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితులు చూసి తీవ్ర ఆవేదన కలుగుతోందని ఆయన పేర్కొన్నారు. “రాష్ట్రంలో వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉంది, రైతులు, నేతలు ఆత్మహత్యలు చేస్తున్నారు, విద్యార్థులు, నిరుద్యోగులు నిరసనలు చేస్తున్నారు, వ్యవస్థలు కుప్పకూలుతున్నాయి” అని ఆందోళన వ్యక్తం చేశారు.
అంతేకాకుండా, బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడూ టైమ్ పాస్ రాజకీయాలు చేయలేదని, ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు పాల్పడలేదని కేటీఆర్ వెల్లడించారు. అయితే గత అయిదారు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ తనను లక్ష్యంగా చేసుకుని తీవ్ర దుష్ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. “హీరోయిన్లతో సంబంధాలు పెట్టి నా పేరు చెడగొట్టడానికి ప్రయత్నించారు. నన్నే కాదు నా పిల్లల వరకు మానసిక క్షోభకు గురి చేశారు” అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఫోన్ ట్యాపింగ్ కేసు విషయానికొస్తే, ఇందులో కూడా కుట్రలు చేస్తున్నారని తాను ఎవరికీ భయపడబోనని కేటీఆర్ స్పష్టం చేశారు.
