Telangana: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ త్వరలో తెలంగాణలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ నెల 7, 8 తేదీల్లో బీజేపీకి మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు హైదరాబాద్లోని పవన్ కల్యాణ్ నివాసానికి వెళ్లి ఆయనను కలిశారు. మున్సిపల్ ఎన్నికలతో పాటు పలు కీలక రాజకీయ అంశాలపై ముగ్గురు నేతలు విస్తృతంగా చర్చలు జరిపారు. ఈ సందర్భంగా బీజేపీ తరఫున ప్రచారంలో పాల్గొనాలని కిషన్ రెడ్డి, రామచందర్ రావు పవన్ కల్యాణ్ను కోరారు.
దీనికి పవన్ కల్యాణ్ సానుకూలంగా స్పందించినట్లు రామచందర్ రావు వెల్లడించారు. ఈ విషయాన్ని ఆయన తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా తెలియజేశారు. ఆ పోస్టులో, కిషన్ రెడ్డితో కలిసి పవన్ కల్యాణ్ను కలవడం గౌరవంగా భావిస్తున్నానని, తెలంగాణలో త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలతో పాటు ఇతర ముఖ్య అంశాలపై అర్థవంతమైన చర్చలు జరిగాయని పేర్కొన్నారు. అలాగే పవన్ కల్యాణ్ బీజేపీకి పూర్తి మద్దతు ప్రకటించి, మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారం చేయడానికి అంగీకరించినట్లు తెలిపారు.
ఇక తెలంగాణ రాష్ట్రంలోని ఏడు కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల పరిధిలో ఫిబ్రవరి 11న పోలింగ్ జరగనుండగా, ఫిబ్రవరి 13న ఫలితాలను ప్రకటించనున్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 243, తెలంగాణ మున్సిపాలిటీల చట్టం–2019 ప్రకారం ఈ ఎన్నికల ప్రక్రియ కొనసాగనుంది. ఈ ఎన్నికల్లో మొత్తం 52.43 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసి పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మేరకు బీజేపీ–జనసేన స్నేహపూర్వక పోటీగా జనసేన పార్టీ ట్వీట్ చేసింది.
Had the honour of meeting Shri @PawanKalyan Garu, Hon’ble Deputy Chief Minister of Andhra Pradesh, along with Shri @kishanreddybjp Garu, Hon’ble Union Minister for Coal and Mines.
We held wide-ranging and meaningful discussions on key issues, including the upcoming Municipal… pic.twitter.com/Cr0XzZj1A5
— N Ramchander Rao (@N_RamchanderRao) February 3, 2026
