Panchyat Elections: తెలంగాణ రాష్ట్రంలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఇవాళ ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైంది. ఇకపోతే మొత్తం గ్రామపంచాయతీలలో ఇప్పటికే 415 గ్రామపంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. మిగిలిన 3,911 గ్రామపంచాయతీలకు ఈ రోజు పోలింగ్ జరగనుంది.
ఈ ఎన్నికల కోసం ఎన్నికల సంఘం రాష్ట్రవ్యాప్తంగా 38,350 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. మొత్తం 57,22,665 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
పోలింగ్ ప్రక్రియ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగనుండగా, అనంతరం 2 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. లెక్కింపు పూర్తయ్యాక ఫలితాలను అధికారికంగా ప్రకటించనున్నారు.
మరోవైపు పోలింగ్ దృష్ట్యా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా పోలీసులు ఏర్పాట్లు చేశారు. ప్రశాంతంగా పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియ జరిగేలా ఏర్పాట్లు చేశారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు అప్రమత్తంగా ఉన్నారు.
పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం తెలంగాణ ప్రభుత్వం.. రూ. 175 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. అందులో ఇప్పటి వరకు రూ.100 కోట్ల మేర నిధులు మంజూరయ్యాయి. ఈ మొత్తాన్ని ఇప్పటికే జిల్లాల్లో ఎన్నికల నిర్వహణ అధికారుల ఖాతాల్లో జమ చేశారు. అలాగే పోలింగ్ కేంద్రాల వారీగా ఎంపీడీవోల ఖాతాల్లో కూడా నిధులు జమ అయ్యాయి. మిగిలిన రూ. 75 కోట్లను కూడా విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఈ నిధులు సరిపోవని, మరో 50 కోట్ల వరకు అవసరం ఉంటుందని ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందినట్లు సమాచారం.
