Pakistan Camp: ‘పాకిస్థాన్ క్యాంప్’ పేరు వెనుక చరిత్ర ఇదే… ఈ పేరుకి మూలం తెలుసుకోవాలంటే సరిగ్గా 54 ఏళ్ల వెనక్కి వెళ్లాల్సి ఉంటుంది. 1971లో తూర్పు పాకిస్థాన్ (ఇప్పటి బంగ్లాదేశ్)లో జరిగిన మత ఘర్షణల్లో అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘర్షణల్లో ప్రాణాలు దక్కించుకున్న అనేక బెంగాలీలు భారతదేశానికి శరణార్థులుగా వచ్చారు. వారి పరిస్థితిని గమనించిన అప్పటి ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ, దేశంలోని పలు ప్రాంతాల్లో వారికి నివాసం, ఉపాధి అవకాశాలు కల్పించాలనే నిర్ణయం తీసుకున్నారు.
ఆ కార్యక్రమంలో భాగంగా ఆ సమయంలో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మందమర్రి, కాగజ్నగర్, కౌటాల, సిర్పూర్ ప్రాంతాల్లో ఈ శరణార్థులను స్థిరపరిచారు.
ఒక గ్రామస్థుడు గుర్తుచేసుకుంటూ చెబుతూ,
“ఇందిరాగాంధీ మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది. ఇళ్లు కట్టించి ఉద్యోగాలు ఇప్పించింది. అప్పట్లో పోలీసులు రోజంతా కాపలా ఉండేవారు. 1971లో వచ్చిన వారికి 5 ఎకరాల భూమి ఇచ్చి ఇళ్లు కట్టించారు,” అని వివరించారు.
తూర్పు పాకిస్థాన్ నుంచి వచ్చిన వారిలో కొంతమందిని మందమర్రి పట్టణ శివారులో సుమారు 200 కుటుంబాలు నివసించేలా ఏర్పాటు చేశారు. వారికి ఆసుపత్రి, పాఠశాలలు కూడా ఏర్పాటు చేయగా, భద్రత కోసం సుమారు 100 మంది పోలీసులతో ప్రత్యేక శిబిరం (క్యాంప్) ఏర్పాటు చేశారు. మూడు సంవత్సరాల పాటు ఆ పోలీస్ శిబిరం కొనసాగింది.
అప్పటి నుంచి ఈ ప్రాంతం గురించి ప్రజల్లో “పాకిస్థాన్ క్యాంప్” అని ప్రచారం మొదలైంది.
ఇంకా ఒక గ్రామస్థుడు చెబుతూ,
“మా తాతలు బంగ్లాదేశ్ నుంచి వచ్చారు. కొంతమంది ఇక్కడే స్థిరపడ్డారు, మరికొందరు వెళ్లిపోయారు. కొత్తతరం వచ్చాక పాకిస్థాన్ పేరు తీసేసి మా దైవమైన కాళీకా దేవి పేరుతో కాళీనగర్ అని పెట్టుకున్నాం,” అని తెలిపారు.
కాలక్రమేణా ఈ ప్రాంతంలో సింగరేణి ఉద్యోగులు స్థిరపడ్డారు. కొందరు “నేతాజీనగర్” అని పేరు పెట్టినా పెద్దగా ఉపయోగంలోకి రాలేదు. ఇప్పటికీ పురపాలక రికార్డుల్లో ‘పాకిస్థాన్ క్యాంప్’ పేరే కొనసాగుతుండగా, స్థానిక యువత మాత్రం గౌరవప్రదంగా “కాళీనగర్” అని పిలుచుకుంటున్నారు.
