Chicken Shops: ఇకపై ఆంధ్రప్రదేశ్లో చికెన్ షాపులు కూడా లైసెన్సుతోనే నడవనున్నాయి. రాష్ట్రంలో చికెన్ వ్యాపారంలో జరుగుతున్న అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం కొత్త నియమాలను అమలు చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో రాష్ట్ర మాంసాభివృద్ధి సంస్థ ప్రత్యేక లైసెన్సింగ్ విధానంను తీసుకురానుంది.
ఇప్పటివరకు చాలామంది గుర్తింపు లేకుండా చికెన్ వ్యాపారం చేస్తున్నారు. ఏ ఫార్మ్ నుంచి కోళ్లు వస్తున్నాయి? ఎవరు కొనుగోలు చేస్తున్నారు? అనే వివరాలు సరిగా నమోదు కాకపోవడంతో నాణ్యత నియంత్రణ కష్టమవుతోంది. ఈ లోపాలను సరిచేయడానికి ఇప్పుడు ప్రభుత్వం చికెన్ సరఫరా వ్యవస్థను పూర్తిగా ట్రాక్ చేసే విధంగా కొత్త సాంకేతిక వ్యవస్థను ప్రవేశపెట్టనుంది.
ఈ విధానం ద్వారా కోడి ఏ ఫార్మ్ నుంచి వచ్చింది, ఏ షాప్కి చేరింది, అక్కడి నుంచి ఎవరికి అమ్మారనే వివరాలన్నీ ఆన్లైన్లో నమోదు అవుతాయి. తద్వారా అనధికారిక వ్యాపారాలు, నాసిరకమైన మాంసం విక్రయాలు తగ్గుతాయి.
ఇకపై హోటళ్లు, రెస్టారెంట్లు కూడా గుర్తింపు పొందిన, లైసెన్స్ ఉన్న షాపుల నుంచే చికెన్ కొనుగోలు చేయాలని ప్రభుత్వం ప్రోత్సహించనుంది. అదేవిధంగా స్టెరాయిడ్లు లేదా ఇతర హానికర రసాయనాలు వాడిన కోళ్ల విక్రయాలను కట్టడి చేయడం ప్రధాన లక్ష్యంగా ఉంది.
ఈ కొత్త విధానం అమల్లోకి వస్తే వినియోగదారులకు నాణ్యమైన, సురక్షితమైన చికెన్ అందుతుందని అధికారులు చెబుతున్నారు. ఇది రైతులకు, వ్యాపారులకు, వినియోగదారులకు అందరికీ మేలు చేసే చర్యగా భావిస్తున్నారు.
