Telangana Jagruthi: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో (Local Body Elections 2026) పాల్గొనే దిశగా తెలంగాణ జాగృతి సీరియస్గా అడుగులు వేస్తోంది. కల్వకుంట్ల కవిత (Telangana Jagruthi Kavitha) ఆధ్వర్యంలోని జాగృతి సంస్థ, త్వరలో నిర్వహించబోయే మున్సిపల్ ఎన్నికలతో పాటు మండల మరియు జిల్లా పరిషత్ ఎన్నికల్లో కూడా పోటీ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. దీంతో జాగృతి రాజకీయ రంగంలోకి అడుగుపెట్టే ప్రక్రియ అందరినీ ఆకర్షిస్తోంది.
ఇదిలా ఉండగా, పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేసే పనిలో ముఖ్య నాయకులు ఉన్నారు. ఈ ప్రక్రియ పూర్తవడానికి సుమారు మూడు నెలలు పట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. రిజిస్ట్రేషన్ పూర్తి అయ్యేలోపు జరిగే మునిసిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో అయితే జాగృతి, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ గుర్తుతో పోటీ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఏఐఎఫ్బీ రాష్ట్ర నాయకత్వంతో ఇప్పటికే చర్చలు జరిగినట్లు సమాచారం. ఈ పార్టీకి చెందిన “సింహం” గుర్తుతో బీఫారం ద్వారా పోటీ చేసే అవకాశం మరింత బలపడింది.
గతంలో ఈ అంశంపై ఆర్టీవీలో ప్రత్యేక కథనం ప్రచురించబడినప్పుడు, అప్పటి వరకు ఎన్నికల్లో పోటీకి సమయం కాలేదని కవిత స్పష్టం చేశారు. అయితే ఇటీవల కార్యకర్తల నుంచి వచ్చిన ఒత్తిడి, మద్దతు, ఉత్సాహం కారణంగా ఎన్నికల్లో బరిలో నిలబడాలని తాజగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రతి మున్సిపాలిటీలో కనీసం 20 నుండి 30 స్థానాల్లో అభ్యర్థులను దింపేందుకు వ్యూహరచన జరుగుతోందని ప్రచారం ఉంది. ఈ క్రమంలోనే ఆశావహులతో కవిత హైదరాబాదులోని తన నివాసంలో సమావేశం కూడా నిర్వహించారు.
పంచాయతీ ఎన్నికల్లో తమకు అనుకూలంగా పలువురు విజయం సాధించడం జాగృతికి నూతన ధైర్యం ఇచ్చిందని చెబుతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో మద్దతుదారులను బరిలో నిలపడం ద్వారా ప్రజాభిప్రాయాన్ని అంచనా వేసి, భవిష్యత్తులో పూర్తి స్థాయి రాజకీయ పార్టీ ఏర్పాటు చేయడానికి పునాది వేసుకోవాలని కవిత లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
Also Read: Oscar 2026: 16 నామినేషన్లతో లీడ్ లో ‘సిన్నర్స్’.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే..
Telangana Jagruthi: స్థానిక సంస్థల ఎన్నికల్లో కవిత పార్టీ పోటీ
