Crime: వరంగల్ జిల్లా మట్టెవాడ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న భార్య హత్య కేసులో భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం గురించి ఏఎస్పీ శుభం ప్రకాశ్ సోమవారం వరంగల్ డివిజన్ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. సూర్యాపేట జిల్లా నూతనకల్లు మండలం, దిర్శనపల్లి గ్రామానికి చెందిన బాదావత్ అశోక్ తన కుమార్తె గౌతమి (20)ను మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం బాల్యతండాకు చెందిన గణేష్కు గత మే 18న పెళ్లి చేశారు.
పెళ్లి సందర్భంగా రూ.2.50 లక్షలు, రెండు తులాల బంగారు గొలుసు, ఒక ఉంగరం, గణేష్ తల్లికి తులం బంగారు గొలుసు, గౌతమికి 15 తులాల బంగారు ఆభరణాలు ఇచ్చారు. అదనంగా 150 గజాల స్థలాన్ని కొంతకాలం తర్వాత ఇస్తామని అంగీకరించారు. పెళ్లి తర్వాత గణేష్, గౌతమి దంపతులు వరంగల్ హంటర్ రోడ్డులోని సాయినగర్ కాలనీలో అద్దె ఇంట్లో నివసించసాగారు.
గణేష్ ఆటో నడిపి జీవనం సాగించేవాడు. మొదట్లో కాపురం సజావుగా సాగినా, తర్వాత కట్నంగా వాగ్దానం చేసిన స్థలం ఇవ్వాలని గణేష్ గౌతమిని వేధించడం ప్రారంభించాడు. పెద్దల సమక్షంలో పంచాయితీ జరగగా, గౌతమి తండ్రి అదనంగా మరో లక్ష రూపాయలు అల్లుడు గణేష్కి ఇచ్చాడు. ఈలోపులో గణేష్ తన పదో తరగతి స్నేహితురాలిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. భార్య అడ్డుగా మారుతుందని భావించి ఆమెను చంపాలని నిర్ణయించాడు.
ఆ యోచనతో ఈ నెల 23న అర్ధరాత్రి నిద్రిస్తున్న గౌతమిపై దాడి చేసి, బెడ్షీట్తో ముఖం కప్పి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. అనంతరం తన భార్య అస్వస్థతకు గురైందని స్థానికులకు చెప్పి ఎంజీఎం ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు నటించి అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన మట్టెవాడ పోలీసులు పరారీలో ఉన్న గణేష్ను వరంగల్ రైల్వే స్టేషన్ వద్ద పట్టుకున్నారు. విచారణలో గణేష్ నేరాన్ని అంగీకరించి, హత్య చేసిన తీరును వివరించాడు. అనంతరం అతడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
