Telangana: “నాడు – నేడు” అన్నట్టుగా తయారైంది మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని నందగోకుల్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ బాల్ నర్సవ్వ పరిస్థితి. ఎందుకంటే ఒకప్పుడు గ్రామ అభివృద్ధి కోసం కృషి చేసిన నర్సవ్వ, ఇప్పుడు బీడీలు చుట్టుకుంటూ, చాలీ చాలని సంపాదనతో జీవనం సాగిస్తున్నారు.
నర్సవ్వ తన గాథను చెప్పుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. సర్పంచ్గా ఉన్నప్పుడు గ్రామంలో అభివృద్ధి పనుల కోసం తనకు ఉన్న భూమిని, ఫ్లాట్ను, బంగారాన్ని అమ్మి ఖర్చు పెట్టినట్లు తెలిపారు. ప్రజల కోసం, గ్రామం కోసం తన సొమ్మంతా వెచ్చించినా, ఇప్పుడు తనకున్న పరిస్థితి ఇంత కష్టంగా మారిందని బాధ వ్యక్తం చేశారు.
అంతేకాదు, సర్పంచ్ పదవిలో ఉన్న కారణంగా తనకు రావలసిన పింఛన్ కూడా నిలిపివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. “గ్రామ అభివృద్ధి కోసం ఎంత కష్టపడ్డా, చివరికి ఈ స్థితి రావడం దురదృష్టకరం” అంటూ గుండెలు బాదుకుంటూ చెప్పారు.
నర్సవ్వ ప్రస్తుతం బీడీ కార్మికురాలిగా కష్టపడి సంపాదించిన చిల్లరతోనే జీవనం కొనసాగిస్తున్నారు. ఈ తక్కువ ఆదాయంతో కుటుంబ అవసరాలు తీర్చుకోవడం చాలా కష్టమైందని చెబుతున్నారు. ప్రభుత్వం అయినా తన సమస్యను గమనించి, రావలసిన బిల్లులు, పింఛన్ చెల్లించాలని వేడుకుంటున్నారు.
ఒకప్పుడు ప్రజల కోసం త్యాగం చేసిన సర్పంచ్ ఇప్పుడు ఇంత దయనీయ స్థితిలో జీవించాల్సి రావడం గ్రామస్తుల మనసులను కూడా కదిలిస్తోంది. నర్సవ్వ గాధను విన్నవారెవరికైనా క్షణం ఆలోచన కలగక మానదు.
