Crime: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒక ఉన్నత స్థాయి ఐఏఎస్ అధికారి పేరు ఇప్పుడు తీవ్ర వివాదంలో నిలిచింది. ఆయన హైదరాబాద్కు చెందిన ఒక మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడనే ఆరోపణలు వెలువడుతున్నాయి. గతంలో కీలకమైన శాఖకు అధిపతిగా పనిచేసి, ముఖ్యమంత్రికి అత్యంత సమీపంగా సేవలందించిన ఈ అధికారి, వ్యక్తిగత జీవితంలో మాత్రం వివాదాస్పద మార్గం ఎంచుకున్నాడని చెబుతున్నారు.
అధికారిక బాధ్యతల కంటే ఎక్కువ సమయం ఆ మహిళతో గడిపేవారని, కుటుంబం పట్ల నిర్లక్ష్యం చూపేవారని ఆరోపణలు ఉన్నాయి. ఇటీవలి కాలంలో ఆ మహిళ ఒక వ్యాధితో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో, ఆమె ప్రవర్తనపై అధికారి అనుమానం పెంచుకున్నాడట. ఆమె వేరే వ్యక్తులతో సన్నిహితంగా ఉంటుందని అనుమానంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది.
ఆ వాగ్వాదం క్రమంగా హింసకు దారితీసి, అధికారి మహిళపై దాడి చేశాడని సమాచారం. ఈ దాడిలో ఆమె తల గోడకు బలంగా తాకి, తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే మృతి చెందింది. అయితే తన పలుకుబడిని ఉపయోగించి, ఇది మెట్ల మీదనుండి పడిపోయిన ప్రమాదం అని ఆసుపత్రి రికార్డుల్లో నమోదు చేయించినట్లు తెలుస్తోంది.
ఈ ఘటన తరువాత ఏమీ జరగనట్లుగా విజయవాడకు తిరిగి వెళ్లి తన విధులను కొనసాగిస్తున్నారని చెబుతున్నారు. ఈ విషయాలు వెలుగులోకి రావడంతో, తోటి అధికారులు, సిబ్బంది తీవ్ర ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ సంఘటనపై అధికారిక దర్యాప్తు జరుగుతుందా లేదా అన్నది మాత్రం ఇంకా స్పష్టత రాలేదు.
