Andhra: పారాణి కూడా పూర్తికాకముందే ఓ నవవధువు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపింది. సోమందేపల్లి మండలంలోని మణికంఠ కాలనీలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
కృష్ణమూర్తి, వరలక్ష్మి దంపతుల ఏకైక కుమార్తె హర్షితకు కర్ణాటక రాష్ట్రం బాగేపల్లికి చెందిన నాగేంద్రతో ఆగస్టు 4వ తేదీన వివాహం జరిగింది. పెళ్లి అంగరంగ వైభవంగా జరగగా, కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. అదే రోజున రాత్రి, నూతన దంపతులకు ఫస్ట్నైట్ కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు.
అయితే ఆ రాత్రి అనూహ్యమైన సంఘటన చోటు చేసుకుంది. వరుడు నాగేంద్ర స్వీట్లు తీసుకురావడం కోసం బయటకు వెళ్లగా, ఇంట్లోని ఇతరులు తమ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ సమయంలో హర్షిత శోభనం గదిలో ఫ్యానుకు ఉరేసుకుని కనిపించింది. ఒక్కసారిగా ఈ దృశ్యం చూసిన కుటుంబసభ్యులు, బంధువులు షాక్కు గురయ్యారు.
హర్షిత గది నుండి బయటకు రాకపోవడంతో, వారు తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లారు. వెంటనే ఆమెను పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
వివాహం రోజునే ఈ విషాదం చోటుచేసుకోవడం అందరినీ కలచివేసింది. పచ్చని తోరణాల మధ్య జరుగుతున్న ఉత్సవం ఒక్కసారిగా శోకసంద్రంగా మారింది. హర్షిత ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. దీనిపై పోలీసులు విచారణ ప్రారంభించారు.
ఇక, హర్షిత మృతితో నాగేంద్ర కుటుంబం పెళ్లి ఇంటినుంచి వెళ్లిపోయింది. హర్షిత ఆకస్మిక మరణంతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. స్థానికులు మాట్లాడుతూ.. హర్షిత ఈ నిర్ణయం తీసుకోవడానికి ఏదో గలుకట్టిన కారణం ఉండే ఉంటుందన్నారు.
