BSNL: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) దీపావళి పండుగ సందర్భంగా వినియోగదారులకు శుభాకాంక్షల బహుమతిగా కొత్త ప్లాన్ను ప్రకటించింది. ‘బీఎస్ఎన్ఎల్ దీపావళి బొనాంజా’ పేరుతో ఈ ప్రత్యేక ఆఫర్ను సంస్థ లాంచ్ చేసింది. ఈ ప్లాన్లో భాగంగా కేవలం రూ.1కే అపరిమిత సేవలు లభ్యమవుతాయి. అయితే, ఈ ఆఫర్ కొత్త వినియోగదారులకే పరిమితం అని బీఎస్ఎన్ఎల్ స్పష్టం చేసింది.
బీఎస్ఎన్ఎల్ ఎక్స్ (X) వేదిక ద్వారా చేసిన పోస్ట్ ప్రకారం, ఈ దీపావళి ఆఫర్ అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్లో 30 రోజుల పాటు అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 2 జీబీ డేటా, అలాగే రోజుకు 100 ఎస్సెమ్మెస్లు ఉచితంగా లభిస్తాయి. అదనంగా, కొత్త సిమ్ కార్డ్ కూడా ఉచితంగా అందజేస్తారు.
దీపావళి సీజన్లో వినియోగదారులకు తక్కువ ధరలో ఎక్కువ సేవలను అందించడమే ఈ స్కీమ్ ఉద్దేశమని బీఎస్ఎన్ఎల్ అధికారులు తెలిపారు. ఈ ఆఫర్ను ఉపయోగించుకోవాలనుకునే వారు తమ సమీపంలోని బీఎస్ఎన్ఎల్ కస్టమర్ సర్వీస్ సెంటర్ (CSC) లేదా రిటైలర్ను సంప్రదించి రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు.
డిజిటల్ కనెక్టివిటీ పెంచే దిశగా, గ్రామీణ ప్రాంతాల వినియోగదారులు కూడా ఈ ప్లాన్ ద్వారా లాభం పొందగలరని బీఎస్ఎన్ఎల్ పేర్కొంది. దీపావళి సందర్భంగా తక్కువ ఖర్చుతో అత్యుత్తమ సేవలను అందించే ఈ రూ.1 ఆఫర్ వినియోగదారులలో ఉత్సాహాన్ని రేపుతోంది.
