Bhogi Mantalu: సంక్రాంతి పండుగ ఉత్సవాలు భోగి మంటలతో ప్రారంభమవుతాయి. తెల్లవారుజామునే చలిని తగ్గిస్తూ వేసే ఈ మంటల వెనుక కేవలం సంప్రదాయం మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక, వైజ్ఞానిక మరియు ఆరోగ్య సంబంధిత భావనలూ దాగి ఉన్నాయి. భోగి అనే పదానికి ‘భోగాలను అనుభవించే రోజు’ అనే అర్థం ఉంది. ఈ రోజున పాత, పనికిరాని వస్తువులను మంటల్లో వేయడం ద్వారా కేవలం సామాగ్రిని కాకుండా మనలోని అహంకారం, చెడు ఆలోచనలు, పాత గాయాలు మరియు చేదు జ్ఞాపకాలను కూడా దూరం చేస్తామనే భావన ఉంది. అంటే బయట పాత వస్తువులు కాలిపోతున్నట్లే, లోపలి నెగటివ్ ఎనర్జీ కూడా పోవాలని ఈ ఆచారం సూచిస్తుంది.
వైజ్ఞానికంగా చూస్తే కూడా భోగి మంటలకు చాలా ప్రాధాన్యత ఉంది. ధనుర్మాసం ముగిసి ఉత్తరాయణం ప్రారంభమయ్యే ఈ కాలంలో వాతావరణంలో గట్టి మార్పులు చోటుచేసుకుంటాయి. తీవ్రమైన చలి కారణంగా రక్త ప్రసరణ మందగించవచ్చు. ఇలాంటి సమయంలో భోగి మంటల వేడి శరీరంలో ఉష్ణాన్ని పెంచి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా ఈ మంటల్లో వేయబడే ఆవుపేడ పిడకలు, మామిడి కట్టెలు అలాగే ఔషధ గుణాలు ఉన్న కలప వంటివి నుంచి వచ్చే పొగ గాల్లో ఉండే క్రిములను నాశనం చేస్తుంది. ఇది ఊపిరితిత్తులకు ఒక రకమైన శుద్ధి ప్రయోజనం కలిగిస్తుందని కూడా భావిస్తారు.
భోగి మంటలకు మరో ప్రతీకాత్మక అర్థం కూడా ఉంది. దక్షిణాయనానికి వీడ్కోలు పలికి సూర్యుడి ఉత్తరాయణ ప్రవేశాన్ని స్వాగతించే సూచికగానీ దీనిని చూస్తారు. పెద్దల మాటల్లో చెప్పాలంటే, ఏడాది పొడుగునా మనల్ని పట్టి ఉంచిన బద్ధకం, దరిద్రం, బాధలు అన్నీ ఈ మంటల్లో కాలిపోతాయని, కొత్త ఉత్సాహంతో జీవితం ప్రారంభించాలనే సంకేతం ఇది. అదేవిధంగా గోదాదేవి శ్రీరంగనాథునితో ఏకమయిన రోజును గుర్తిస్తూ కూడా భోగి జరుపుకోవడం వల్ల భక్తి భావం పెరుగుతుందని నమ్మకం ఉంది. ఈ మంటల చుట్టూ తిరగడం శుభఫలితాలు ఇస్తుందని మరెందరో విశ్వసిస్తున్నారు.
భోగి మంటలు వేసేటప్పుడు ప్లాస్టిక్, టైర్లు వంటి పర్యావరణానికి హానికరమైన పదార్థాలను కాల్చకూడదు. సహజ పదార్థాలతో మంటలు వేసినప్పుడే ఈ సంప్రదాయం వెనుక ఉన్న అసలైన ఉద్దేశ్యం నెరవేరుతుంది.—
