Anant Ambani: పంజాబ్లోని వరదల కారణంగా జీవితాలు, ఆస్తిపాస్తులు కోల్పోయిన బాధితులకు రిలయన్స్ సంస్థ వారసుడు అనంత్ అంబానీ చేయూతనిచ్చారు. మల్టీ మిలియనీర్ అయినప్పటికీ, తన మంచి మనసును చాటుకుంటూ బాధితులకు అండగా నిలిచారు. ఈ సాయం ద్వారా వరద ప్రభావితులైన వేలాది కుటుంబాలకు కొంత ఊరట లభించింది.
అనంత్ అంబానీ ఆధ్వర్యంలో రిలయన్స్ ఫౌండేషన్, వనతారా ఫౌండేషన్ కలసి ప్రత్యేక సహాయక కార్యక్రమాన్ని ప్రారంభించాయి. ఈ క్రమంలో, వరదల కారణంగా అన్నిటిని కోల్పోయిన 10 వేల కుటుంబాలకు పోషకాహారంతో కూడిన రేషన్ కిట్లు అందజేశారు. కేవలం ఆహారంతో మాత్రమే ఆగకుండా, ఒంటరి మహిళలు మరియు వృద్ధులకు నేరుగా రూ.5 వేల నగదు సహాయం అందించారు. ఈ చర్య బాధితుల మనోధైర్యాన్ని పెంచడమే కాకుండా, తక్షణ అవసరాలను తీర్చడంలో కీలకంగా నిలిచింది.
అలాగే, వరదలతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న పశువుల కోసం వైద్య సహాయం, మందులు, ఆహారం కూడా పంపిణీ చేయించారు. వ్యవసాయంపై ఆధారపడిన పంజాబ్ ప్రజలకు పశువుల రక్షణ ఎంతో అవసరం కావడంతో ఈ సహాయం వారికి మరింత ఉపయుక్తమైంది.
అనంత్ అంబానీ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. “డబ్బున్నవాడు మాత్రమే కాదు, నిజమైన శ్రీమంతుడు తన సొమ్ము, సమయాన్ని సమాజం కోసం వినియోగించే వాడే” అని నెటిజన్లు అభిప్రాయపడ్డారు.
