Viral: కన్నడ సినీ పరిశ్రమలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా నిలిచిన నటి రమ్య, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సినిమాలకు విరామం ఇచ్చారు. ప్రస్తుతం క్రియాశీల రాజకీయాలనుంచి కూడా వెళ్లిపోయిన ఆమెకు సినిమా మీద మాత్రం ఆసక్తి తగ్గలేదు. తిరిగి సినీ రంగంలో అడుగు పెట్టేందుకు ప్రయత్నంగా ఆమె ఓ నిర్మాణ సంస్థను కూడా ప్రారంభించారు.
పోలిటిక్స్కి దూరమైనా, సామాజిక అంశాలపై రమ్య యాక్టివ్గా స్పందిస్తూ ఉంటారు. ప్రత్యేకంగా జంతువుల హక్కుల విషయంలో ఆమె గళమెత్తడం కొత్త విషయం కాదు. రమ్య జంతు ప్రేమికురాలు, ముఖ్యంగా వీధి కుక్కల సమస్యలపైన తరచూ తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ వస్తున్నారు.
గత ఏడాది జూలైలో వీధి కుక్కలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చి, వాటిని ఆశ్రయ కేంద్రాల్లో ఉంచాలని సూచించింది. ఈ ఆదేశాలపై దేశవ్యాప్తంగా ఉన్న కుక్కల ప్రేమికులు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. రమ్య కూడా వారిలో ఒకరు. కొన్నిచోట్ల నిరసనలు కూడా జరిగాయి.
ఇదే అంశంపై తాజాగా మళ్లీ విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు, కుక్కల ప్రవర్తన ఆధారంగా వాటిని వేరు వేరు విభాగాలుగా చూడటం సాధ్యం కాదని వ్యాఖ్యానించింది. “ఈ కుక్క కాటేస్తుంది, ఇది కాటేయదు అని ముందే ఊహించడం అసాధ్యం. వీధి కుక్కల మూడ్ ఎవరూ అర్థం చేసుకోలేరు” అని వ్యాఖ్యానిస్తూ, అందుకే అన్నీ కుక్కలను ఆశ్రయ కేంద్రాల్లో ఉంచడమే సరైన మార్గమని అభిప్రాయం వ్యక్తం చేసింది.
కోర్టు చేసిన ఈ వ్యాఖ్యలపై రమ్య సోషల్ మీడియాలో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆమె ఘాటుగా, “మగవాళ్లను కూడా అర్థం చేసుకోవడం కష్టం. ఎప్పుడు అత్యాచారం చేస్తారో, ఎప్పుడు హత్య చేస్తారో చెప్పలేం. అలా అంటే పురుషులందరినీ జైలులో పెట్టేయాలా?” అంటూ వ్యాఖ్యానించారు.
కుక్కల విషయంలో తీసుకుంటున్న ‘ఒకే విధానాన్ని’ విమర్శించేందుకు ఇచ్చిన ఈ ఉపమానంతో రమ్య తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. అయితే ఈ వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో మరో చర్చ మొదలైంది. మగవాళ్లను కుక్కలతో పోల్చిందని అంటూ నెటిజన్లు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది.
