Odisha: ఓడిశా రాష్ట్రం కంధమాల్ జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. హాస్టల్లో సహచర విద్యార్థులు ఆటపట్టించే ప్రయత్నంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నిద్రలో ఉన్న ఎనిమిది మంది చిన్నారుల కళ్లలో ఇన్స్టంట్ గ్లూ పోయడంతో, వారు ఆస్పత్రి పాలయ్యారు. కళ్లపై గ్లూ పడటంతో నిద్రలేవగానే వారి కనుపాపలు పూర్తిగా అతుక్కుపోయాయి.
ఈ ఘటన కంధమాల్లోని సేవాశ్రమ పాఠశాల, సలగుడాలో జరిగింది. మూడో, నాలుగో, ఐదో తరగతి చదువుతున్న ఎనిమిది మంది విద్యార్థులు రాత్రి హాస్టల్లో నిద్రిస్తుండగా, కొందరు సహచరులు ఆటపట్టిస్తూ కళ్లలో గ్లూ పోశారు. నిద్రలేచిన పిల్లలకు మంట, నొప్పి కలిగింది. కళ్లపాపలు మూసుకుపోవడంతో భయాందోళనకు గురై కేకలు వేయగా, హాస్టల్ అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే వారిని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఫుల్బానీ జిల్లా ఆస్పత్రికి పంపించారు.
ఈ సందర్భంగా విద్యార్థుల దృశ్యాలు బయటకు వచ్చాయి. కనుపాపలు మూసుకుపోయి, ఏడుస్తున్న చిన్నారులను చూస్తే ఎవరికైనా గుండె తరుక్కుపోతుంది. డాక్టర్లు చాలా జాగ్రత్తగా కళ్లను వేరుచేయడానికి ప్రయత్నించారు. వైద్యుల ప్రకారం – గ్లూ వల్ల కళ్లకు గాయాలు అయినప్పటికీ, సమయానికి చికిత్స చేయడం వల్ల శాశ్వతంగా చూపు కోల్పోయే ప్రమాదం తప్పింది.
కాగా వీరిలో ఇప్పటికే ఒకరిని డిశ్చార్జ్ చేశారు. మిగతా ఏడుగురు విద్యార్థులు ఇంకా వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఈ సంఘటనపై కంధమాల్ జిల్లా అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. నిర్లక్ష్యం కారణంగా పాఠశాల హెడ్మాస్టర్ మనోజ్ సాహును సస్పెండ్ చేశారు. ఏమి జరిగిందన్నదానిపై ఉన్నతస్థాయి విచారణ ప్రారంభించారు.
అదేవిధంగా జిల్లా చైల్డ్ వెల్ఫేర్ అధికారి కూడా ఆస్పత్రిని సందర్శించి పిల్లల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు.
