Accident: మద్యం మత్తులో ఓ ఆర్మీ జవాన్ చేసిన దారుణం మహారాష్ట్ర నాగ్పూర్ లో చోటుచేసుకుంది. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం, హర్ష్పెల్ మహదేవ్ అనే ఆర్మీ జవాన్ ఆదివారం రాత్రి 8.30 ప్రాంతంలో నాగర్ధాన్ ప్రాంతంలోని దుర్గాచౌక్ నుంచి హమ్లాపూర్ దిశగా కారులో బయల్దేరాడు. అయితే అప్పటికే అతను మద్యం మత్తులో ఉండటంతో కారు నియంత్రణ కోల్పోయి రోడ్డుపై నడుస్తున్న సుమారు 30 మంది పాదచారులను ఢీకొట్టాడు.
తర్వాత కారు బోల్తాపడి పక్కనే ఉన్న కాలువలో పడిపోయింది. అక్కడ ఉన్న స్థానికులు వెంటనే స్పందించి హర్ష్పెల్ను బయటకు తీశారు. అయితే అతను మద్యం మత్తులో నిర్లక్ష్యంగా కారు నడిపినందుకు కోపంగా ఉన్న ప్రజలు అతడిని చితకబాదారు. తీవ్రంగా దాడి చేయడంతో ముఖంపై గాయాలవడంతో అతడు దాడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకొని హర్ష్పెల్ మహదేవ్ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కారుతో ఢీకొన్న కారణంగా గాయపడిన వ్యక్తులకు కూడా వైద్యసహాయం అందిస్తున్నారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు తెలిపారు.
హర్ష్పెల్ అస్సాంలో భారత సైన్యంలో పనిచేస్తున్నారని, నాలుగు రోజుల సెలవుల్లో భాగంగా స్వస్థలమైన మహారాష్ట్రలోని సురాదేవి గ్రామానికి వచ్చారని గుర్తించామని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇక మరో ఘటనలో, ఇటీవల ఉత్తరప్రదేశ్లోని మేర్ఢ్లో ఓ ఆర్మీ జవాన్ మద్యం మత్తులో రైల్వే స్టేషన్లో వీరంగం సృష్టించాడు. కారు నడిపిస్తూ నేరుగా రైల్వే ప్లాట్ఫారమ్ మీదకు ఎక్కాడు. అదే సమయంలో స్టేషన్లో రైలు రానుండటంతో భారీ గందరగోళం నెలకొంది. సుమారు 20 నిమిషాలపాటు హడావుడి సృష్టించిన అతడిని ఆర్పీఎఫ్ సిబ్బంది సహాయంతో స్టేషన్ నుంచి తరలించారు.
