Tamil Nadu: తమిళనాడులోని కరూర్ జిల్లా మేట్టుమహదానపురంలోని అరుళ్మిగు శ్రీమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో అరుదైన ఆచారం ఇప్పటికీ కొనసాగుతోంది. సుమారు 400 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం ఆడి మాసంలో భక్తులు ప్రత్యేక దీక్షలు చేపడతారు. దీక్ష ప్రారంభమైన 18 రోజుల తర్వాత 19వ రోజు తలపై కొబ్బరికాయ కొట్టించుకోవడం ద్వారా వారు మొక్కులు తీర్చుకుంటారు.

ఈ ఆచారం సోమవారం ఆలయంలో ఘనంగా జరిగింది. అందులో భాగంగా 800 మందికి పైగా భక్తులు మహిళలు, పురుషులు పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణంలో భక్తులు వరుసగా కూర్చుని ఉండగా, ఆలయానికి చెందిన పారంపర్య పూజారి ఒక్కొక్కరి తలపై కొబ్బరికాయలు కొట్టారు.
భక్తుల నమ్మకం ప్రకారం… కొబ్బరికాయ పగిలితేనే మొక్కు తీరిందని భావిస్తారు. ఈ విధంగా శరీరానికి గాయాలవుతున్నా కూడా, దీన్ని త్యాగానికి ప్రతీకగా తీసుకుంటూ ఎంతో భక్తిశ్రద్ధలతో ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు.
