Delhi: ఢిల్లీలో వాతావరణ కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుకుంది. రాజధాని నగరంలోని గాలిలో ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఉన్నట్లు జేఎన్యూ శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. ఈ బ్యాక్టీరియా యాంటీబయాటిక్స్కూ లొంగని ‘సూపర్ బగ్’గా నిర్ధారించారు. ముఖ్యంగా ఢిల్లీలోని మురికివాడలు, అధిక రద్దీ ఉన్న ప్రాంతాల్లో ఈ బ్యాక్టీరియా ఎక్కువగా వ్యాపిస్తున్నట్లు పరిశోధనలో వెల్లడైంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నిర్దేశించిన పరిమితితో పోలిస్తే ఇది దాదాపు 16 రెట్లు ఎక్కువ ప్రమాదకరమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ బ్యాక్టీరియా న్యూమోనియా, రక్త ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే అవకాశం ఉందని తెలిపారు. ప్రజలు మరింత జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు జారీ చేశారు.
ఇదిలా ఉండగా, ఇవాళ ఉదయం ఢిల్లీలో గాలి నాణ్యత సూచిక ప్రమాదకర స్థాయిలో నమోదైంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వివరాల ప్రకారం, నగరంలో ఓవరాల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 384గా నమోదైంది. అలాగే నగరంలోని పలు ఎయిర్ మానిటరింగ్ కేంద్రాల్లో ఏక్యూఐ 400 మార్క్ను దాటి ‘తీవ్రమైన’ కేటగిరీలోకి చేరింది. ఈ పరిస్థితులతో ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలను అత్యంత ప్రభావిత ప్రాంతాలుగా అధికారులు ప్రకటించారు.
