Bharat Bandh: దేశవ్యాప్తంగా రేపు (ఫిబ్రవరి 12, 2026) సార్వత్రిక సమ్మె జరగనుంది. కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ వివిధ రంగాలకు చెందిన కార్మిక సంఘాలు ఈ దేశవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చాయి. ఈ సమ్మె ప్రభావంతో బ్యాంకింగ్, రవాణా, ప్రభుత్వ కార్యాలయాల పనితీరులో తీవ్ర అంతరాయం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. అందుకే సామాన్య ప్రజలు ముందుగానే తమ అవసరమైన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.
ఈ సార్వత్రిక సమ్మెలో దేశంలోని దాదాపు 10 ప్రధాన కార్మిక సంఘాలు ఏకమై పాల్గొంటున్నాయి. ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (AITUC) ప్రధాన కార్యదర్శి అమర్జీత్ కౌర్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఆందోళనలో సుమారు 30 కోట్ల మంది కార్మికులు పాల్గొనే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా 600 జిల్లాల్లో సమ్మె ప్రభావం కనిపించనుందని, నిరసన కార్యక్రమాలు భారీగా నిర్వహించనున్నట్లు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వ ఆర్థిక, వ్యవసాయ, కార్మిక విధానాలు తమకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ముఖ్యంగా 2025 నవంబర్లో ప్రభుత్వం నోటిఫై చేసిన నాలుగు కొత్త కార్మిక కోడ్లు ఈ సమ్మెకు ప్రధాన కారణంగా మారాయి. వీటితో పాటు విద్యుత్ సవరణ బిల్లు, అణుశక్తికి సంబంధించిన ‘శాంతి’ (SHANTI) చట్టం, డ్రాఫ్ట్ సీడ్ బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA)ను మరింత బలోపేతం చేయాలని, ప్రతిపాదిత భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేయాలని కార్మికులు కోరుతున్నారు. రైతు సంఘాల కూటమి సంయుక్త కిసాన్ మోర్చా (SKM) కూడా ఈ సమ్మెకు పూర్తి మద్దతు ప్రకటించింది.
రవాణా రంగంపై ఈ సమ్మె ప్రభావం గణనీయంగా ఉండనుంది. బస్సులు, ఆటోలు నడవడం కష్టతరమయ్యే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో రోడ్డు దిగ్బంధనలు జరిగితే ప్రైవేట్ వాహనదారులు కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. మార్కెట్లు, రెస్టారెంట్లు మూతపడే అవకాశం ఉందని చెబుతున్నారు. విమానాశ్రయాలు సాధారణంగా పనిచేసినా, రహదారులపై ట్రాఫిక్ సమస్యల కారణంగా ప్రయాణికులు ముందుగానే విమానాశ్రయానికి చేరుకోవాలని సూచిస్తున్నారు. అత్యవసర సేవలైన ఆసుపత్రులు, అంబులెన్స్లను సమ్మె పరిధి నుంచి మినహాయించారు.
బ్యాంకింగ్ రంగంపై ఈ సమ్మె ప్రభావం మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సహా పలు ప్రధాన బ్యాంక్ ఉద్యోగ సంఘాలు సమ్మెలో పాల్గొంటున్నాయి. దీంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB), బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో నగదు లావాదేవీలు, చెక్కుల క్లియరెన్స్ నిలిచిపోయే పరిస్థితి ఏర్పడవచ్చు. ఖాతాదారులు అవసరమైతే డిజిటల్ బ్యాంకింగ్ సేవలను వినియోగించుకోవాలని బ్యాంకులు సూచిస్తున్నాయి.
ప్రభుత్వ విధానాలపై అసంతృప్తితో ఉన్న కార్మిక వర్గం తమ డిమాండ్లను బలంగా వినిపించేందుకు ఈ సమ్మెను వేదికగా ఎంచుకుంది. 2026లో జరుగుతున్న తొలి భారీ సార్వత్రిక సమ్మె కేంద్ర ప్రభుత్వంపై ఎంత మేర ఒత్తిడి తీసుకువస్తుందన్నది చూడాల్సి ఉంది. సమ్మె నేపథ్యంలో శాంతిభద్రతలు కాపాడేందుకు పోలీసు యంత్రాంగం ఇప్పటికే అప్రమత్తమైంది.
