Cancer: క్యాన్సర్ అనే పదం వినగానే చాలామందికి భయం కలుగుతుంది. ఇప్పటివరకు ఈ వ్యాధి చికిత్స చాలా కష్టతరంగా, దీర్ఘకాలంగా సాగేది. కానీ తాజాగా ఒక ఆశాజనకమైన సమాచారం వెలువడింది. ఒక్క ఇంజెక్షన్ రూపంలో ఇచ్చే ఒక ప్రత్యేకమైన మందుతో క్యాన్సర్ నయం కావచ్చని తొలి ప్రయోగాల్లో తేలింది.
ఈ కొత్త మందు పేరు “2141.V11”. ఇది సీడీ40 అగోనిస్ట్ యాంటీబాడీ తరగతికి చెందినది. ఈ రకం మందులపై గత 20 ఏళ్లుగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. జంతువులపై చేసిన పరీక్షల్లో మంచి ఫలితాలు వచ్చినప్పటికీ, మనుషులపై అంతగా విజయవంతం కాలేదు. అంతేకాకుండా ఈ మందులకు కొన్ని తీవ్రమైన దుష్ప్రభావాలు కూడా ఉండేవి. శరీరమంతా వాపు కలగడం, రక్తంలో ప్లేట్లెట్ల సంఖ్య తగ్గిపోవడం, కాలేయం దెబ్బతినడం వంటి సమస్యలు గుర్తించారు.
ఈ సమస్యలకు పరిష్కారం కనుగొనే ప్రయత్నంలో రాక్ఫెల్లర్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్త జెఫ్రీ వి. రావెచ్ 2018లో ఈ మందును సురక్షితంగా మార్చే మార్గాన్ని సూచించారు. ఆ పరిశోధనల ఫలితంగా “2141.V11” అనే కొత్త వెర్షన్ రూపుదిద్దుకుంది.
తాజాగా ఈ మందును, ఇప్పటికే శరీరంలో ఇతర భాగాలకు వ్యాపించిన క్యాన్సర్ ఉన్న 12 మందిపై పరీక్షించారు. ఫలితాలు ఆశ్చర్యం కలిగించేవిగా నిలిచాయి. వీరిలో 6 మందిలో కణితులు కుంచించుకుపోయాయి. అంతేకాకుండా 2 మందిలో రక్త క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్లు పూర్తిగా నయమయ్యాయి. మందు నేరుగా జొప్పించిన కణితులే కాకుండా, ఇతర అవయవాల్లోని కణితుల పరిమాణం కూడా తగ్గడం ప్రత్యేకంగా గమనించారు.
శాస్త్రవేత్తల ప్రకారం, ఒకే మందు శరీరమంతా ప్రభావం చూపించడం చాలా అరుదైన విషయం. అందుకే ఈ ఫలితాలు వైద్యరంగంలో గొప్ప విజయంగా భావిస్తున్నారు. అయితే, ఇంకా విస్తృత స్థాయి పరిశోధనలు జరగాల్సి ఉంది. కానీ ఒక ఇంజెక్షన్తోనే క్యాన్సర్ను నియంత్రించగలమనే ఆశ కలిగించడం వైద్యరంగంలో విప్లవాత్మక పరిణామంగా భావించవచ్చు.
Also Read: Andhra: మృత్యువులోనూ వీడని స్నేహం
Cancer: క్యాన్సర్పై విప్లవాత్మక అడుగు – ఒక్క ఇంజెక్షన్ మందుతో నయం అవుతుందా?
