RGV: గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఏఆర్ రెహమాన్ పేరు హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా ఆయన ఆస్కార్ అందుకున్న ‘జై హో’ పాట కంపోజిషన్పై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గతంలో చేసిన వ్యాఖ్యలు మళ్లీ బయటకు రావడంతో చర్చలు మరింత పెరిగాయి.
ఆ పాటను అసలు రెహమాన్ కంపోజ్ చేయలేదని, సుఖ్విందర్ సింగ్ చేసిన ట్యూన్ను 5 లక్షలకు కొనుగోలు చేసి, తర్వాత 3 కోట్లకు అమ్మేశారంటూ సోషల్ మీడియాలో పెద్దఎత్తున ప్రచారం జరిగింది. 2009లో వచ్చిన ‘యువరాజ్’ కోసం ఆ ట్యూన్ను అనుకున్నారనే వార్తలు కూడా వైరల్ కావడంతో రెహమాన్ అభిమానులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.
ఈ వివాదం రెహమాన్ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా మారడంతో నెట్టింట పెద్ద దుమారం రేగింది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ ద్వారా స్పందించి ఈ ప్రచారాలకు ముగింపు పలికాడు. తన మాటలను సందర్భం లేకుండా ప్రసారం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు.
“ఏఆర్ రెహమాన్ నా దృష్టిలో కేవలం గొప్ప సంగీత దర్శకుడే కాదు, ఎంతో వినయవంతుడు, మంచి మనిషి. రెహమాన్ వంటి వారు ఇతరుల క్రెడిట్ను ఎప్పుడూ దొంగిలించరు. ఆయన ప్రతిభను నేను ఎప్పుడూ గౌరవిస్తాను. కేవలం సంచలనం కోసం కొన్ని వర్గాలు నా పాత ఇంటర్వ్యూ మాటలను మార్చి చూపిస్తున్నారు. సుఖ్విందర్ సింగ్ ట్యూన్ను రెహమాన్ కొనుగోలు చేశారన్న ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదు. అంతర్జాతీయ స్థాయి ప్రతిభావంతుడైన వ్యక్తిపై ఇలాంటి ఆరోపణలు చేయడం దురదృష్టకరం. ఇప్పుడు అయినా తప్పుడు ప్రచారాలను ఆపాలి” అని వర్మ స్పష్టం చేశాడు. దీంతో వివాదం తగ్గుముఖం పట్టింది.
