Balasaraswathi Devi: తెలుగు సినీ సంగీత ప్రపంచాన్ని శోకసంద్రంలో ముంచెత్తే వార్త వెలువడింది. తొలి తరం నేపథ్య గాయనిగా పేరుపొందిన ప్రముఖ గాయని రావు బాలసరస్వతి దేవి (Raavu Balasaraswathi Devi) ఇక లేరు. బుధవారం ఉదయం హైదరాబాద్లో ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 97 సంవత్సరాలు. కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె మణికొండలోని తన నివాసంలో కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
1928 ఆగస్టు 29న జన్మించిన బాలసరస్వతి దేవి చిన్ననాటి నుంచే సంగీతంపై ఆసక్తి చూపారు. కేవలం ఆరేళ్ల వయసులోనే పాటలు పాడడం ప్రారంభించి, తక్కువ కాలంలోనే శ్రోతల మన్ననలు పొందారు. ఆకాశవాణి ద్వారా ఆమె స్వరం తెలుగు ప్రజలకు బాగా సుపరిచితమైంది. 1936లో వచ్చిన ‘సతీ అనసూయ’ చిత్రంలో తొలిసారిగా నేపథ్య గాయనిగా పాట పాడి తెలుగు సినీ చరిత్రలో తన పేరును శాశ్వతంగా నిలిపారు.
తర్వాత కాలంలో తెలుగు, తమిళం, కన్నడ, హిందీ సహా పలు భాషల్లో 2000కు పైగా పాటలు ఆలపించారు. తన మధుర గానంతో ప్రేక్షకులను అలరించిన ఆమెను అభిమానులు ప్రేమగా ‘లలిత సంగీత సామ్రాజ్ఞి’ అని పిలిచేవారు.
రావు బాలసరస్వతి దేవి మరణ వార్త సినీ, సంగీత రంగాలను తీవ్ర విషాదంలో ముంచింది. పలువురు ప్రముఖులు ఆమె కుటుంబానికి సానుభూతి తెలియజేస్తూ, “తెలుగు సంగీత చరిత్రలో ఓ బంగారు అధ్యాయం ముగిసింది” అని నివాళులు అర్పించారు.
