- ఢిల్లీలో వెండి ధర కిలోకు రూ.1.40 లక్షలు
- హైదరాబాద్లో లక్షన్నర మార్కును దాటిన రేటు
- ఒకే ఏడాదిలో 56% పెరుగుదల
- అంతర్జాతీయ పరిణామాలు, పారిశ్రామిక డిమాండే కారణం
- గత దశాబ్దంలోనే అత్యధిక వార్షిక వృద్ధి
Gold Rates: బంగారం తరహాలోనే వెండి కూడా పరుగులు పెడుతోంది. సామాన్యులు అందుకోలేనంత ఎత్తుకు చేరి కొత్త రికార్డులు నమోదు చేస్తోంది. గురువారం ఢిల్లీ బులియన్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.1,000 పెరిగి, జీవితకాల గరిష్ఠమైన రూ.1.40 లక్షలకు చేరుకుంది. అయితే హైదరాబాద్ మార్కెట్లో ఈ రేటు ఇప్పటికే రూ.1.50 లక్షల మార్కును దాటింది. ఈ ఊహించని పెరుగుదల కొనుగోలుదారులకు షాక్ ఇస్తోంది.
స్పాట్ మార్కెట్తో పాటు ఫ్యూచర్స్ ట్రేడింగ్లో కూడా వెండి కొత్త శిఖరాలను తాకింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో డిసెంబర్ కాంట్రాక్ట్ ధర 2.63% పెరిగి రూ.1,37,530కు చేరింది. అదే విధంగా 2026 మార్చి కాంట్రాక్ట్ 2.53% లాభపడి రూ.1,38,847 వద్ద ట్రేడయింది. మరోవైపు అంతర్జాతీయంగా కూడా వెండి ధర చరిత్రాత్మక రికార్డు సృష్టించింది. ఔన్స్ వెండి ధర 45 డాలర్లను దాటి, ఇప్పటివరకు ఎప్పుడూ నమోదు కాని స్థాయికి చేరింది.
ఈ ఏడాది వెండి ధరల పెరుగుదల అసాధారణం. గతేడాది చివర్లో కిలో వెండి రూ.89,700గా ఉండగా, ఇప్పటి వరకు రూ.50,300 పెరిగి 56% వృద్ధిని సాధించింది. ఒకే ఏడాదిలో ఇంత భారీ పెరుగుదల రావడం ఇదే తొలిసారి. గత పదేళ్లలో ఇదే అత్యధిక వార్షిక వృద్ధిగా రికార్డు సృష్టించింది.
ధరల పెరుగుదల వెనుక పలు జాతీయ, అంతర్జాతీయ అంశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గించే సూచనలతో పెట్టుబడిదారులు డాలర్, బాండ్ల కంటే బంగారం, వెండి వంటి విలువైన లోహాలవైపు మొగ్గు చూపుతున్నారు. వాణిజ్య అనిశ్చితి కూడా దీనికి తోడైంది. అంతేకాదు, ఎలక్ట్రానిక్స్, పారిశ్రామిక రంగాల్లో వెండి వినియోగం పెరగడం వల్ల డిమాండ్ మరింతగా పెరిగింది. దేశీయంగా పండుగల సీజన్, రూపాయి విలువ తగ్గడం కూడా ధరల పెరుగుదలకు పెద్ద కారణాలుగా మారాయి.
