UPI Payments: గూగుల్ పే, ఫోన్ పే, భారత్ పే, పేటీఎం వంటి యూపీఐ యాప్స్ వినియోగించే వారికి ఒక మంచి శుభవార్త. ఇకపై ఎలాంటి పిన్ టైప్ చేయకుండా కూడా చెల్లింపులు చేయడం సాధ్యమవుతుంది. బయోమెట్రిక్ అథెంటికేషన్ పేమెంట్స్ అనే కొత్త విధానం రేపటి నుంచే అమలులోకి వచ్చే అవకాశం ఉంది. అంటే, ముఖం (Face ID) లేదా వేలిముద్ర (Finger Print) ఆధారంగా పేమెంట్లు చేయవచ్చు. ఈ కొత్త సిస్టమ్ను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) అక్టోబర్ 8న లాంచ్ చేయనుందని సమాచారం.
దేశంలో డిజిటల్ చెల్లింపుల రంగాన్ని పూర్తిగా మార్చిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) ఇప్పుడు మరో పెద్ద మార్పుకు దారితీస్తోంది. ఇప్పటివరకు 4 లేదా 6 అంకెల పిన్ నంబర్తోనే పేమెంట్లు చేసేవారు. ఇకపై పిన్ లేకుండానే ట్రాన్సాక్షన్లు పూర్తి చేసే అవకాశం కల్పించనుంది ఎన్పీసీఐ. రాయిటర్స్ వెల్లడించిన సమాచారం ప్రకారం, ఈ కొత్త ఫీచర్ను ముంబైలో జరుగుతున్న ఫిన్టెక్ ఫెస్టివల్ వేదికగా ప్రవేశపెట్టే అవకాశముంది.
ఇప్పటివరకు దీనిపై ఎన్పీసీఐ లేదా యూపీఐ పేమెంట్ అగ్రిగేటర్ల నుండి అధికారిక ప్రకటన రాలేదు. అయితే, ఈ వ్యవస్థ అందుబాటులోకి వస్తే, యూజర్లు తమ ఆధార్ బయోమెట్రిక్ డేటాను ఉపయోగించి పేమెంట్లు చేయవచ్చు. ఇందుకోసం ఉడాయ్ డేటాబేస్ లోని వివరాలను ఉపయోగించే అవకాశముందని చెబుతున్నారు.
ఇటీవలి కాలంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) కూడా యూపీఐ పేమెంట్లలో పిన్కు ప్రత్యామ్నాయ విధానాలను ప్రవేశపెట్టాలని సూచించింది. ఆ సూచనల మేరకు ఎన్పీసీఐ బయోమెట్రిక్ ఆధారిత పేమెంట్లపై దృష్టి సారించింది.
ఈ కొత్త బయోమెట్రిక్ పేమెంట్ సిస్టమ్ అమల్లోకి వస్తే, పిన్ అవసరం లేకుండా చెల్లింపులు చేయగలిగే సౌకర్యం లభిస్తుంది. దీంతో యూపీఐ వ్యవస్థలో మరింత భద్రత, సౌలభ్యం కలుగుతాయి. ఇది డిజిటల్ పేమెంట్స్ రంగంలో మరో విప్లవాత్మక మార్పుగా చెప్పవచ్చు.
