Tragedy: మహిళ ప్రాణం తీసిన ట్రాఫిక్ జామ్.. పైకి పోకుండానే నరకం చూసింది

Maharashtra Woman Dies In Ambulance Caught In Massive NH-48 Traffic Jam

Maharashtra Woman Dies In Ambulance Caught In Massive NH-48 Traffic Jam

Tragedy: మహారాష్ట్రలోని ముంబయి సమీపంలో చోటుచేసుకున్న దారుణ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలిస్తుండగా, జాతీయ రహదారి-48పై ఏర్పడిన భారీ ట్రాఫిక్ జామ్ కారణంగా ఓ మహిళ ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని కలిగించింది.

పాలఘర్ జిల్లాకు చెందిన ఛాయా పూరవ్‌ (45) అనే మహిళ ఇంటి సమీపంలో చెట్టు కొమ్మ విరిగి పడటంతో తీవ్ర గాయాలు అయ్యాయి. ఆమెకు పక్కటెముకలు, భుజం, తల భాగంలో గాయాలైనట్లు వైద్యులు గుర్తించారు. ఆ ప్రాంతంలో ట్రామా సెంటర్ లేకపోవడంతో, స్థానిక ఆసుపత్రి సిబ్బంది ఆమెను ముంబయిలోని హిందుజా ఆసుపత్రికి తరలించమని కుటుంబ సభ్యులకు సూచించారు.

సుమారు 100 కిలోమీటర్ల దూర ప్రయాణానికి సాధారణంగా 2.5 గంటలు పడుతుందని భావించి, వైద్యులు ముందుగానే ఆమెకు అనస్థీషియా ఇచ్చారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో అంబులెన్స్‌ బయలుదేరింది. అయితే, మార్గమధ్యంలో ఎన్హెచ్-48 రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్నారు. సాయంత్రం 6 గంటల వరకు కేవలం సగం దూరమే చేరగలిగారు.

అప్పటికే అనస్థీషియా ప్రభావం తగ్గిపోవడంతో, ఛాయా తీవ్రమైన నొప్పితో విలవిల్లాడింది. ఈ పరిస్థితిలో తక్షణ వైద్యసాయం అందించేందుకు అంబులెన్స్ సిబ్బంది, రాత్రి 7 గంటల సమయంలో ముంబయి హిందుజా ఆసుపత్రికి ఇంకా 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న మీరా రోడ్‌లోని ఆర్బిట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. వైద్యులు ఆమెను పరిశీలించి మృతిగా ప్రకటించారు.

“మేము కనీసం అరగంట ముందే ఆసుపత్రికి తీసుకొచ్చి ఉంటే ఆమె ప్రాణం కాపాడగలిగేవాళ్లం” అని వైద్యులు తెలిపారు.

ఈ ఘటనపై భర్త కౌశిక్ ఆవేదన వ్యక్తం చేస్తూ – “నా భార్య నాలుగు గంటల పాటు భరించలేని నొప్పితో విలవిల్లాడింది. రోడ్డు గుంతలతో నిండిపోవడం వల్ల ఆమె బాధ మరింత పెరిగింది. నొప్పితో అరుస్తూ, త్వరగా ఆసుపత్రికి తీసుకెళ్లమని వేడుకుంది. కానీ ట్రాఫిక్‌లో ఇరుక్కుపోవడంతో సమయానికి చేరుకోలేకపోయాం” అని వాపోయారు.

Also Read: Dowry: ఇక్కడ పెళ్లిలో వరకట్నం లేదు, బరాత్ ఖర్చు లేదు

Tragedy: మహిళ ప్రాణం తీసిన ట్రాఫిక్ జామ్.. పైకి పోకుండానే నరకం చూసింది