Ration Cards: తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డుల జారీపై పౌరసరఫరాల శాఖ కీలక సమాచారం వెల్లడించింది. కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియను ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతరంగా కొనసాగిస్తామని అధికారులు స్పష్టం చేశారు. అలాగే ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లను చేర్చే ప్రక్రియ కూడా ఆగకుండా కొనసాగుతుందని తెలిపారు. ఇంకా రేషన్ కార్డు పొందని వారు సమీపంలోని మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
గత ప్రభుత్వ హయాంలో తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ దాదాపుగా నిలిచిపోయింది. దీంతో చాలా మంది సామాన్య ప్రజలు రేషన్ ప్రయోజనాలు పొందలేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొత్తగా పెళ్లి చేసుకున్నవారు, కుటుంబాలుగా విడిపోయినవారు, పిల్లలు పుట్టిన కుటుంబాలు చాలాకాలంగా రేషన్ కార్డు లేక ప్రభుత్వ పథకాల నుంచి దూరమయ్యారు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కొత్త రేషన్ కార్డుల జారీకి శ్రీకారం చుట్టింది.
ప్రభుత్వం చేపట్టిన ఈ చర్యల ఫలితంగా కేవలం ఒక సంవత్సర కాలంలోనే భారీ సంఖ్యలో రేషన్ కార్డులు మంజూరు అయ్యాయి. గత ఏడాది కాలంలో మొత్తం 14.40 లక్షల కొత్త రేషన్ కార్డులను జారీ చేసినట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు వెల్లడించారు. ఈ కొత్త కార్డుల ద్వారా ప్రస్తుతం రాష్ట్రంలో 54.49 లక్షల మంది అదనపు లబ్ధిదారులు రేషన్ సరుకులు పొందుతున్నారు.
రేషన్ కార్డుల విషయంలో ఇకపై తెలంగాణ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు భరోసా ఇస్తున్నారు. అవసరమైన అర్హతలు ఉన్న ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు అందేలా ప్రక్రియను నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు. కొత్త రేషన్ కార్డులు కావాలనుకునేవారు, లేదా పాత కార్డుల్లో మార్పులు చేయాలనుకునేవారు మీసేవ కేంద్రాలను సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా రేషన్ కార్డుల జారీ ప్రక్రియ సులభతరం కావడంతో సామాన్య ప్రజలకు పెద్ద ఊరట కలిగిందని అధికారులు చెబుతున్నారు.
