Silver Price: గత కొంతకాలంగా వెండి ధరలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. ఈ పెరుగుదల సామాన్య ప్రజలకు షాక్ ఇస్తుండగా, గ్లోబల్ మార్కెట్లోనూ వెండి హాట్ టాపిక్గా మారింది. ఈ నేపథ్యంలో ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత, ప్రముఖ ఇన్వెస్టర్ రాబర్ట్ కియోసాకి చేసిన తాజా వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి. అమెరికా డాలర్ భవిష్యత్తుపై ఆయన మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
తాజాగా తాను మరో 600 సిల్వర్ ఈగల్స్ కొనుగోలు చేసినట్లు వెల్లడించిన కియోసాకి, రాబోయే రోజుల్లో వెండి ధరలు ఊహించని స్థాయికి చేరుతాయని అన్నారు. ప్రస్తుతం వెండి ఔన్సు ధర సుమారు 82 డాలర్ల వద్ద ఉండగా, 2026 చివరినాటికి ఇది 200 డాలర్లను దాటే అవకాశముందని ఆయన అభిప్రాయపడ్డారు. “అమెరికా డాలర్ ప్రమాదంలో ఉంది. ఫేక్ మనీని నిల్వ చేసేవారే ఎక్కువగా నష్టపోతారు” అంటూ కియోసాకి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
2026 సంవత్సరానికి చెందిన సిల్వర్ ఈగల్స్ భవిష్యత్తులో విలువైన కలెక్టర్ కాయిన్స్గా మారతాయని, వెండి మార్కెట్లో పెద్ద స్థాయి కల్లోలం తప్పదని ఆయన అంచనా వేశారు. ఈ ట్వీట్ వైరల్ కావడంతో ఇన్వెస్టర్లలో ఆసక్తి మరింత పెరిగింది. ఇదే సమయంలో భారత మార్కెట్లో కూడా వెండి ధరలు రికార్డులు సృష్టిస్తున్నాయి. హైదరాబాద్ సహా పలు ప్రధాన నగరాల్లో కేజీ వెండి ధర ఇప్పటికే రూ.3 లక్షలను దాటింది. ఒక్కరోజులోనే కేజీపై సుమారు రూ.15,000 వరకు పెరగడం గమనార్హం.
కియోసాకి అంచనాలు నిజమైతే, వెండి ఔన్సు ధర 200 డాలర్లకు చేరినప్పుడు భారత మార్కెట్లో కేజీ వెండి ధర రూ.6 లక్షల వరకు వెళ్లే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
వెండి ధరలు పెరగడానికి ప్రధాన కారణాలుగా డాలర్ విలువ పడిపోవడం, ఇన్వెస్టర్లు బంగారం, వెండి వంటి సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపడం ఉన్నాయి. అలాగే ఏఐ టెక్నాలజీ, చిప్ తయారీ, సోలార్ ప్యానెల్స్ రంగాల్లో వెండి వినియోగం భారీగా పెరగడం కూడా ధరల పెరుగుదలకు దోహదం చేస్తోంది. తవ్వకం తక్కువగా ఉండటం, డిమాండ్ ఎక్కువగా ఉండటంతో వెండి కొరత ఏర్పడి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
Also Read: Andhra: 54 ఏళ్ల వ్యక్తితో 14 ఏళ్ల కూతురి పెళ్లి
Silver Price: వెండి ధర రూ.6 లక్షలు..!
