IND vs NZ: భారత్ — న్యూజిలాండ్ మధ్య నాగ్పూర్లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో బుధవారం (జనవరి 21) జరిగిన మొదటి టీ20 మ్యాచ్లో టీమిండియా అద్భుత విజయాన్ని నమోదు చేసింది. 48 పరుగుల తేడాతో కివీస్ జట్టుపై గెలిచిన భారత్ సిరీస్లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్లో అబ్బురపరిచిన ప్రదర్శనతో అభిషేక్ శర్మ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును అందుకున్నాడు.
IND vs NZ – అభిషేక్ శర్మ శ్రేష్ఠ ఇన్నింగ్స్
మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 238 పరుగులు చేసింది. ఓపెనర్లు సన్యూ శాంసన్ (10), ఇషాన్ కిషాన్ (8) త్వరగా ఔట్ కావడంతో టీమిండియా 27 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో క్రీజ్లో దిగిన అభిషేక్ శర్మ (84) దూకుడుగా ఆడి స్కోర్ను గణనీయంగా ముందుకు తీసుకెళ్లాడు. అతనికి సూర్యకుమార్ యాదవ్ (32) మంచి సహకారం అందించాడు.
మధ్య ఓవర్లలో కివీస్ బౌలర్లు కొంత పట్టు సాధించడంతో భారత్ స్కోర్ 185 వద్ద ఆరు వికెట్లు కోల్పోయింది. అయితే చివర్లో రింకూ సింగ్ 20 బంతుల్లో 44 పరుగులు చేయడంతో టీమిండియా భారీ స్కోర్ను నమోదు చేసింది.
భారీ లక్ష్యాన్ని చేధించేందుకు రంగంలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 190 పరుగులకు మాత్రమే చేరుకుంది. అర్షదీప్ సింగ్ తొలి ఓవర్లోనే కాన్వేను డకౌట్ చేయగా, హార్దిక్ పాండ్య రవీంద్ర (1) వికెట్ దక్కించుకున్నాడు.
దీంతో గ్లెన్ ఫిలిప్స్, రాబిన్సన్ కలిసి స్కోర్ను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే వరుణ్ చక్రవర్తి తన తొలి ఓవర్లోనే రాబిన్సన్ (21)ను ఔట్ చేసి జోడీని విరగదీశాడు. తర్వాత ఫిలిప్స్ (78) చాప్మాన్ (39)తో మరో భాగస్వామ్యాన్ని నెలకొల్పినా, అక్షర్ పటేల్ తన బౌలింగ్తో ఫిలిప్స్ను ఔట్ చేసి కివీస్ ఆశలను పూర్తిగా కూలదోశాడు.
చివర్లో మిచెల్, సాంట్నర్ కొంత ప్రతిఘటన చూపించినప్పటికీ జట్టును విజయానికి చేర్చలేకపోయారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, శివమ్ దూబే చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. అర్షదీప్ సింగ్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్య చెరో వికెట్ సాధించారు.
