Crime: పశ్చిమబెంగాల్ హుగ్లీ జిల్లాలో మరో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. తారకేశ్వర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఒక కుటుంబం నివసిస్తోంది. శుక్రవారం రాత్రి నాలుగేళ్ల చిన్నారి తన అమ్మమ్మ పక్కన నిద్రిస్తోంది. ఈ సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఆమెను అపహరించి, లైంగిక దాడికి పాల్పడ్డాడు.
ఉదయం లేచిన కుటుంబ సభ్యులకు చిన్నారి కనిపించకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెతికిన అనంతరం రైల్వే స్టేషన్ దగ్గర డ్రెయిన్ ప్రాంతంలో చిన్నారి రక్తస్రావంతో ఉన్నట్టుగా గుర్తించారు. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. మొదట చికిత్స అందించిన తర్వాత వైద్యులు చిన్నారిని డిశ్చార్జ్ చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే చిన్నారి పరిస్థితి తీవ్రంగా ఉండగా, వైద్యులు ఘటనపై సరిగ్గా స్పందించలేదని వారు ఆరోపిస్తున్నారు. ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్కు వెళ్లినా, తమ మాట వినకుండా పంపించేశారని కుటుంబం పేర్కొంది.
తర్వాత పోలీసులు చిన్నారిని మళ్లీ ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని అధికారులు తెలిపారు.
ఈ ఘటనపై రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చ మొదలైంది. ప్రతిపక్షాలు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నాయి. భాజపా నాయకుడు సువేందు అధికారీ పోలీసుల చర్యలను ప్రశ్నిస్తూ, చిన్నారి కేసును కప్పిపుచ్చే ప్రయత్నం జరుగుతోందని మండిపడ్డారు.
స్థానిక ఎమ్మెల్యే రామేందు సింఘా రాయ్ ఈ సంఘటన బాధాకరమని పేర్కొన్నారు. రైల్వే పోలీసుల భద్రతా విఫలమే దీనికి కారణమని తెలిపారు. చిన్నారికి చికిత్స అందిస్తున్నామని చెప్పారు.
